Loading...
Indian motorcycle exports: కొలంబియా నుంచి నైజీరియా వరకు.. 154 దేశాల్లో ఇండియా బైకుల హవా!
కొలంబియా నుంచి నైజీరియా వరకు.. 154 దేశాల్లో ఇండియా బైకుల హవా!

Indian motorcycle exports: కొలంబియా నుంచి నైజీరియా వరకు.. 154 దేశాల్లో ఇండియా బైకుల హవా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2026
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొలంబియా సందడిగా ఉండే నగరాల నుంచి నైజీరియాలోని వాణిజ్య కేంద్రాల వరకు.. భారత్‌లో తయారైన మోటార్‌సైకిళ్లు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రోజువారీ ప్రయాణాలకు కీలకంగా మారుతున్నాయి. దీంతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద టూ-వీలర్ ఎగుమతిదారుల్లో ఒకటిగా ఎదుగుతోంది. ప్రస్తుతం భారత్‌లో తయారవుతున్న ప్రతి నాలుగు మోటార్‌సైకిళ్లలో దాదాపు ఒకటి విదేశాలకు ఎగుమతి అవుతోంది.

వివరాలు

భారత్‌లో తయారైన ప్రతి 4 బైక్‌లలో ఒకటి ఎగుమతి

2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో మొత్తం 1.75 కోట్ల మోటార్‌సైకిళ్లు తయారయ్యాయి. ఇందులో 44.77 లక్షల మోటార్‌సైకిళ్లు ఎగుమతి అయ్యాయి.

మొత్తం ఉత్పత్తిలో ఎగుమతుల వాటా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 22.7 శాతం ఉండగా.. 2025-26లో 25.7 శాతానికి పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లు భారత టూ-వీలర్ తయారీదారులకు ఎంత కీలకంగా మారుతున్నాయో ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అయితే మొత్తం టూ-వీలర్ ఎగుమతులను పరిశీలిస్తే.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 51.8 లక్షల యూనిట్లు విదేశాలకు వెళ్లాయి.

ఇది ఇప్పటివరకు ఒక ఆర్థిక సంవత్సరంలో నమోదైన అత్యధిక ఎగుమతులు. 2024-25తో పోలిస్తే ఈ ఎగుమతులు 23.4 శాతం పెరిగాయి

వివరాలు

దేశీయ బ్రాండ్లకు అంతర్జాతీయంగా గుర్తింపు

. భారత టూ-వీలర్ కంపెనీల ఉత్పత్తుల వైవిధ్యం పెరగడం, దేశీయ బ్రాండ్లకు అంతర్జాతీయంగా గుర్తింపు రావడం, వాహనాల నాణ్యత బలంగా ఉండటం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా భారత బైక్‌లకు ఆదరణ పెరగడానికి కారణమవుతున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) తెలిపింది.

రూపాయి విలువ తగ్గడం కూడా ఎగుమతుల పరిమాణం పెరగడానికి సహకరిస్తోందని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

భారీగా పెరిగిన మోటార్‌సైకిల్ ఎగుమతులు

గత కొన్నేళ్లుగా భారత మోటార్‌సైకిల్ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. ఎగుమతుల విలువ 2017-18లో రూ.12,903 కోట్ల నుంచి 2021-22లో రూ.22,249 కోట్లకు పెరిగింది.

2025-26 నాటికి ఇది మరింత పెరిగి రూ.35,253 కోట్లకు చేరింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలోనే మోటార్‌సైకిల్ ఎగుమతులు దాదాపు 30 శాతం పెరిగాయి.

2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో తయారైన మోటార్‌సైకిళ్లు 154 దేశాలకు ఎగుమతి అయ్యాయి. అయితే మొత్తం ఎగుమతుల్లో దాదాపు సగం వాటాను కేవలం ఏడు దేశాలే కలిగి ఉన్నాయి.

ఈ జాబితాలో కొలంబియా అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా నిలిచింది. ఆ తర్వాత మెక్సికో, శ్రీలంక, నేపాల్, నైజీరియా, బ్రెజిల్, గినియా దేశాలున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

బైక్ ఎగుమతుల దూకుడులో ఈ కంపెనీల పాత్ర

భారత్ నుంచి మోటార్‌సైకిల్ ఎగుమతుల్లో బజాజ్ ఆటో అగ్రస్థానంలో ఉంది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి జరిగిన మోటార్‌సైకిల్ ఎగుమతుల్లో బజాజ్ ఆటో వాటా 38 శాతంగా ఉంది. టీవీఎస్ మోటార్ 27.5 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది.

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా, హీరో మోటోకార్ప్, ఇండియా యమహా మోటార్, సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా కూడా ప్రధాన ఎగుమతిదారుల్లో ఉన్నాయి.

వివరాలు

 ఎగుమతుల్లో 2.5 శాతం వాటా  

బజాజ్ ఆటో తన 2025-26 వార్షిక నివేదికలో లాటిన్ అమెరికా మార్కెట్‌లో తమ బ్రాండ్లకు బలమైన ఆదరణ కొనసాగుతోందని తెలిపింది.

ఈ ప్రాంతంలో మరోసారి రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు పేర్కొంది.

శ్రీలంక, నేపాల్, ఫిలిప్పీన్స్ సహా పలు ఆసియా మార్కెట్లలోనూ మంచి వృద్ధి నమోదైందని.. నైజీరియాలో మార్కెట్ రికవరీ స్థిరత్వానికి అనుకూల సంకేతాలు చూపించిందని వెల్లడించింది.

వివరాలు

ప్రపంచ టూ-వీలర్ మార్కెట్‌లో భారత్ స్థానం మరింత బలోపేతం

అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తక్కువ ధర, మెరుగైన ఇంధన సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లకు డిమాండ్ పెరుగుతోంది.

దీంతో భారత్ ప్రపంచ టూ-వీలర్ తయారీ కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.

మోటార్‌సైకిల్ ఎగుమతులు రికార్డు స్థాయికి చేరడం, విదేశీ మార్కెట్లలో భారతీయ బ్రాండ్లకు ఆదరణ పెరుగుతుండటంతో.. రానున్న రోజుల్లో ఈ రంగం వృద్ధి భారత్‌లోని మార్కెట్‌తో పాటు విదేశీ రోడ్లపై కూడా ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

ADVERTISEMENT