Windfall Tax on Petrol :జులై 1 నుంచి కొత్త విండ్ఫాల్ టాక్స్.. పెట్రోల్,డీజిల్పై కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై విధించే విండ్ఫాల్ టాక్స్లో కీలక మార్పులు చేసింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు,పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై అమలులో ఉన్న విండ్ఫాల్ టాక్స్ను సవరించినట్లు కేంద్రం అధికారిక సర్క్యులర్ విడుదల చేసింది. సవరించిన కొత్త పన్ను రేట్లు జులై 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. ఈ మార్పుల ప్రకారం పెట్రోల్పై విధించే విండ్ఫాల్ టాక్స్ను లీటరుకు రూ.1.50 నుంచి రూ.4కు పెంచారు. అంటే గతంతో పోలిస్తే ఇది 100 శాతానికి పైగా పెరిగినట్లైంది. మరోవైపు డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్)పై విధించే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ను తగ్గించడం విశేషం.
వివరాలు
విండ్ఫాల్ టాక్స్ అంటే ఏమిటి?
దేశీయంగా ఉత్పత్తి అయ్యే డీజిల్ ఎగుమతులపై విండ్ఫాల్ టాక్స్ను లీటరుకు రూ.14 నుంచి రూ.8.50కు తగ్గించారు. దీంతో దాదాపు 40 శాతం మేర తగ్గింపు లభించినట్లైంది. అలాగే విమాన ఇంధనమైన ఏటీఎఫ్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.12.50 నుంచి రూ.7.50కు తగ్గించారు. ఇది 30 శాతానికి పైగా తగ్గినట్లుగా చెప్పొచ్చు. పెట్రోల్, డీజిల్పై విండ్ఫాల్ టాక్స్ పెరగడం లేదా తగ్గడం వల్ల నేరుగా బంకుల్లో విక్రయించే రిటైల్ ధరలపై ప్రభావం ఉండదు. ఇది వినియోగదారులపై కాకుండా ఆయిల్ కంపెనీల అదనపు లాభాలపై విధించే ప్రత్యేక పన్ను.
వివరాలు
విండ్ఫాల్ టాక్స్ అంటే ఏమిటి?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిన సమయంలో రిలయన్స్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి చమురు సంస్థలు దేశీయ అవసరాల కంటే విదేశాలకు ఎక్కువగా ఎగుమతులు చేసి అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేశీయంగా చమురు లభ్యత తగ్గకుండా, ఎగుమతులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 2022జులైలో విండ్ఫాల్ టాక్స్ విధానాన్ని తీసుకొచ్చింది. కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాలపై ఈ పన్ను విధించడం ద్వారా దేశీయ సరఫరాను ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఏటీఎఫ్పై పన్ను తగ్గించడంతో విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంపై కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో విమాన టికెట్ ధరల్లో స్వల్ప మార్పులు కనిపించే అవకాశాన్ని నిపుణులు సూచిస్తున్నారు.
వివరాలు
కొన్ని దేశాలకు విండ్ఫాల్ టాక్స్ నుంచి మినహాయింపు
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి విండ్ఫాల్ టాక్స్ను సమీక్షించి అవసరమైన మార్పులు చేస్తుంటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో తొలిసారిగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అనంతరం చమురు ధరలు తగ్గడంతో 2024లో ఈ పన్నును ఉపసంహరించారు. ఇటీవల అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు మళ్లీ పెరగడంతో విండ్ఫాల్ టాక్స్ను మరోసారి అమలు చేశారు. అప్పటి నుంచి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పన్ను రేట్లలో మార్పులు కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు నేపాల్,భూటాన్,బంగ్లాదేశ్,శ్రీలంక, మారిషస్, మాల్దీవులకు చేసే పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విండ్ఫాల్ టాక్స్ నుంచి మినహాయింపు కొనసాగుతోంది.
వివరాలు
పెట్రోల్,డీజిల్ ధరల్లో మార్పు ఉంటుందా?
విండ్ఫాల్ టాక్స్లో మార్పులు చేసినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో వెంటనే ఎలాంటి మార్పు ఉండదని స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన యుద్ధ పరిణామాల కారణంగా ఇంధన ధరలు లీటరుకు సుమారు రూ.7.50 వరకు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు 126 డాలర్ల స్థాయి నుంచి ప్రస్తుతం 74 డాలర్ల వరకు తగ్గినా, దేశీయ ఇంధన ధరల్లో ఇప్పటివరకు మార్పులు చేయలేదు. భవిష్యత్తులో క్రూడాయిల్ ధరలు మరింత తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.73 కాగా, డీజిల్ ధర రూ.103.82గా కొనసాగుతోంది.