UPI At France: ఉజ్బెకిస్థాన్లో యూపీఐ సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు త్వరలో ఉజ్బెకిస్థాన్లో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ వారాంతంలో రెండు రోజుల పాటు తాష్కెంట్లో అధికారిక పర్యటనకు వెళ్లిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. భారత్ డిజిటల్ మౌలిక వసతులను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయడంలో ఇది కీలక ముందడుగు అని విదేశాంగ శాఖ కార్యదర్శి (పశ్చిమ) సిబి జార్జ్ తెలిపారు.
వివరాలు
ఎన్పీసీఐ-ఉజ్బెకిస్థాన్ మధ్య వాణిజ్య ఒప్పందం
మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్థాన్లో యూపీఐని అమలు చేసేందుకు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL), ఉజ్బెకిస్థాన్ నేషనల్ ఇంటర్బ్యాంక్ ప్రాసెసింగ్ సెంటర్ జేఎస్సీ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందంతో భారతీయ యూపీఐ యాప్ల ద్వారా ఉజ్బెకిస్థాన్లోని వ్యాపారుల వద్ద ఉన్న UZQR క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు.
దీంతో రెండు దేశాల మధ్య డిజిటల్ లావాదేవీలు మరింత సులభంగా సాగడంతో పాటు ఆర్థిక సంబంధాలు కూడా బలోపేతం కానున్నాయి.
వివరాలు
భారత్-ఉజ్బెకిస్థాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం
భారత్, ఉజ్బెకిస్థాన్ దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి.
2030 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఆదివారం ప్రధాని మోదీ, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ మధ్య చర్చలు జరిగిన అనంతరం ఈ ఒప్పందం కుదిరింది.
వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతులు, కీలక ఖనిజాలు, గనుల రంగం, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఔషధాలు, ఆరోగ్యం, సమాచార సాంకేతికత, డిజిటల్ ప్రజా మౌలిక వసతులు తదితర రంగాలకు సంబంధించి మొత్తం 11 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
వివరాలు
పర్యాటకులకు నగదు రహిత ప్రయాణం
అంతర్జాతీయంగా యూపీఐ సేవల విస్తరణతో విదేశాలకు వెళ్లే భారత పర్యాటకులు, ఇతర అర్హత కలిగిన వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది.
సంప్రదాయ అంతర్జాతీయ నగదు బదిలీ పద్ధతులతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే యూపీఐ ద్వారా వెంటనే, సురక్షితంగా డబ్బు పంపడం, స్వీకరించడం సాధ్యమవుతుంది.
దీంతో పర్యాటకులు చేతిలో పెద్ద మొత్తంలో నగదు ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా నగదు రహిత ప్రయాణం చేయవచ్చు.
భారత బ్యాంకు ఖాతాలకు అనుసంధానమైన యాప్ల ద్వారా నేరుగా డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశం లభిస్తుంది.