Sai Pallavi: రూమర్స్ను భరించలేను.. సాయిపల్లవి లీగల్ వార్నింగ్!
సాయి పల్లవి తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నా, ఆత్మగౌరవంపై దెబ్బకొట్టే రూమర్స్ను తట్టుకోలేకపోయింది. ఇటీవల ఆమె 'అమరన్'తో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నాగ చైతన్య సరసన 'తండేల్' సినిమాలో నటిస్తుండగా, బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ'లో సీత పాత్రను పోషించనున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, అల్లు అరవింద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం, ఈ పాత్ర కోసం సాయిపల్లవి తన జీవనశైలిలో కొన్ని మార్పులు చేశారట. మాంసాహారం ముట్టుకోరాదని నిర్ణయించుకుని, విదేశాల్లో కూడా తన వంట సిబ్బందిని వెంట తీసుకువెళ్తున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి.
నిరాధారమైన కథనాలు ప్రచురిస్తే చర్యలు తప్పవు
ఈ రూమర్స్పై సాయిపల్లవి తాను మౌనం వహించలేనని, ఇకపై దుష్ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎన్నో రూమర్స్ని తట్టుకుని మౌనంగా ఉన్నానని, కానీ ఇప్పుడు ఈ విషయం మితిమీరిందన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్ని తారుమారు చేసే నిరాధార వార్తలను భరించలేనని పేర్కొంది. గుర్తింపు పొందిన మీడియా సంస్థలైనా, నిరాధారమైన కథనాలు ప్రచురిస్తే చర్యలు తప్పవని సాయిపల్లవి పేర్కొన్నారు. సాయిపల్లవి ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది. సాయిపల్లవి ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన ప్రాజెక్టులకు న్యాయం చేస్తూ, సీత పాత్రలో కొత్త ఒరవడి సృష్టించనున్నారని సినీ పరిశ్రమ అంచనా వేస్తోంది.