Loading...
AIG Hospitals: విశాఖలో ఏఐజీ మెగా హాస్పిటల్.. రూ.2,000 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టు
విశాఖలో ఏఐజీ మెగా హాస్పిటల్.. రూ.2,000 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టు

AIG Hospitals: విశాఖలో ఏఐజీ మెగా హాస్పిటల్.. రూ.2,000 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ వైద్య రంగంలో మరో భారీ ప్రాజెక్టు అడుగుపెట్టింది. ఆసియాలో పేరొందిన ఏఐజీ హాస్పిటల్స్‌ విశాఖపట్నంలో కొత్త సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనుంది. విశాఖ ఆనందపురం మండలం ఎండాడలో నిర్మించనున్న ఈ మెగా హాస్పిటల్‌కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. ఏఐజీ హాస్పిటల్స్‌ ఛైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ డి. నాగేశ్వర్‌ రెడ్డితో కలిసి మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వివరాలు 

రూ.2,000 కోట్ల పెట్టుబడి.. 9,000 మందికి ఉపాధి

విశాఖలో ఏర్పాటు కానున్న ఈ ఆసుపత్రి కోసం ఏఐజీ యాజమాన్యం ఐదేళ్ల వ్యవధిలో దశలవారీగా రూ.2,000 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.

నిర్మాణం పూర్తయిన తర్వాత వెయ్యి పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్‌ ఉత్తరాంధ్రలోని అతిపెద్ద వైద్య కేంద్రాల్లో ఒకటిగా అవతరించనుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 9,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

పెద్ద మొత్తంలో పెట్టుబడి రావడంతో ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని అంచనా.

వివరాలు 

రెండు దశల్లో హాస్పిటల్ నిర్మాణం

ఈ మెగా ఆసుపత్రిని రెండు దశల్లో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు.

తొలిదశలో 650 పడకలతో ఆసుపత్రిని సిద్ధం చేయనున్నారు. 2028 అక్టోబర్‌ నాటికి ఈ దశలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆ తర్వాత మరో రెండేళ్లలో మిగిలిన 350 పడకలతో రెండో దశ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.

మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో హాస్పిటల్‌ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. అదనంగా 2.5 ఎకరాల స్థలంలో నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు.

దీంతో వైద్య సేవలతో పాటు నర్సింగ్‌ విద్యకు కూడా ఈ ప్రాజెక్టు కేంద్రంగా మారనుంది.

ADVERTISEMENT

వివరాలు 

8 సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌.. 50కి పైగా వైద్య విభాగాలు

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌ తరహాలో విశాఖ కేంద్రంలోనూ అధునాతన వైద్య సేవలు అందించనున్నారు.

మొత్తం 8 సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌తో పాటు 50కి పైగా వైద్య విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.

ప్రపంచ స్థాయి వైద్య ప్రమాణాలకు అనుగుణంగా సేవలు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.

రోగులకు చికిత్స అందించడంతోనే ఈ ప్రాజెక్టు పరిమితం కాకుండా.. వైద్య శిక్షణ, పరిశోధన, రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సదుపాయాలను ఒకే ప్రాంగణంలో కల్పించనున్నారు.

ఈ విధంగా సమగ్ర హెల్త్‌కేర్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని ఏఐజీ యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం

శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మంత్రి నారా లోకేశ్‌కు ఏఐజీ హాస్పిటల్స్‌ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం భూమి పూజ నిర్వహించిన మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఆసుపత్రి నిర్మాణ ప్రణాళికలు, భవిష్యత్‌లో అందించనున్న వైద్య సేవలకు సంబంధించిన ప్రత్యేక ఆడియో విజువల్‌ (ఏవీ) ప్రదర్శనను ఆయన వీక్షించారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబు, ఏఐజీ వైస్‌ ఛైర్మన్‌ పీవీఎస్‌ రాజు, డైరెక్టర్‌ జీవీ రావు, సీఈవో సామ్‌ రిజ్వీ, జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్, పోలీస్‌ కమిషనర్‌ డా. శంఖభ్రత బాగ్చీతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.

ADVERTISEMENT