Polavaram Left Canal: పోలవరం ఎడమ కాలువలో ట్రయల్ రన్.. సెప్టెంబరు 2 లేదా 3న అనకాపల్లికి నీరు
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎడమ కాలువ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తికాగా.. ప్రస్తుతం కొంత దూరం వరకు స్వల్ప స్థాయిలో నీటిని వదులుతూ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి వరద జలాలను ఎడమ కాలువలోకి తీసుకువచ్చి అనకాపల్లి వరకు అందించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. పుష్కర ఎత్తిపోతల పథకంలో ప్రస్తుతం పైపులైన్లను మార్చే పనులు కొనసాగుతున్నాయి. సెప్టెంబరు 2 నాటికి ఈ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
వివరాలు
750 క్యూసెక్కుల నీరు
పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి 750 క్యూసెక్కుల నీటిని తీసుకుని పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లా వరకు తరలించనున్నారు.
ఇందులో భాగంగా కాలువలో నీటి ప్రవాహాన్ని పరీక్షిస్తున్నారు.
పోలవరం ఎడమ కాలువలో 67వ కిలోమీటరు వద్ద ఉన్న రెగ్యులేటర్ వరకు ఇప్పటికే కొంత మేర నీటిని తీసుకువచ్చి నిలిపివేశారు.
బుధవారం అక్కడి నుంచి 85వ కిలోమీటరు వద్ద ఉన్న క్రాస్బండ్ వరకు ట్రయల్ రన్లో భాగంగా నీటిని వదులుతున్నారు. క్రాస్బండ్ వద్ద కొంత మేర నీటిని నిల్వ చేయనున్నారు.
వివరాలు
సీఎం చేతుల మీదుగా అనకాపల్లికి నీటి విడుదల
85వ కిలోమీటరు వద్ద నీటిని నిల్వ చేసిన తర్వాత క్రమంగా 111వ కిలోమీటరు వరకు ట్రయల్ రన్ కొనసాగించాలని అధికారులు యోచిస్తున్నారు.
ఈ ప్రక్రియలో భాగంగా కాలువలో నీటిని దశలవారీగా ముందుకు తీసుకెళ్లనున్నారు.
111వ కిలోమీటరు నుంచి అనకాపల్లి జిల్లాకు నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
సెప్టెంబరు 2 లేదా 3న సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లాకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.
అప్పటిలోగా ట్రయల్ రన్ ద్వారా కాలువలో నీటిని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియను పూర్తి చేయనున్నారు.