Nepal Flash Floods: నేపాల్లో వరద బీభత్సం.. 16 మంది మృతి.. బీహార్,యూపీలో హైఅలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్లో భోటేకోశి నది ఉగ్రరూపం దాల్చింది. ఆకస్మికంగా వచ్చిన వరదలతో చైనా సరిహద్దుకు సమీపంలోని నేపాల్లోని రసువా జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఈ వరదల్లో ఇప్పటివరకు వందలాది మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. వరదల్లో కొట్టుకుపోయిన వారిలో 105 మంది భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వరద ప్రవాహానికి రహదారులు, గ్రామాలు కొట్టుకుపోగా.. 10కి పైగా జలవిద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భోటేకోశి నది టిబెటన్ హిమాలయ ప్రాంతంలో పుట్టి.. నేపాల్లోని సింధుపాల్చౌక్, రసువా జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. నేపాలీ భాషలో 'భోటే' అంటే టిబెటన్ అని అర్థం. టిబెట్లో ఉద్భవించే కోషి నదికి ఇది ఉపనది.
వివరాలు
నేపాల్లో విలయం సృష్టించిన అదే నది బీహార్లోకి..
అనంతరం భోటేకోశి సుంకోశి నదిలో కలుస్తుంది. సుంకోశి, అరుణ్, తమూర్ తదితర నదులు కలిసి కోషి నదీ వ్యవస్థగా ఏర్పడి.. చివరకు భారతదేశంలోని బీహార్లోకి ప్రవహిస్తాయి.
నేపాల్లో సంభవించిన వరదలు ఇప్పుడు భారత్లోనూ ఆందోళనకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా బీహార్కు వరద ముప్పు పొంచి ఉంది.
నేపాల్లో ఉగ్రరూపం దాల్చిన భోటేకోశి నది టిబెట్లో పుట్టి, నేపాల్ మీదుగా భారత్లోకి ప్రవేశిస్తుంది.
బీహార్లోకి వచ్చిన తర్వాత దీనిని కోసి నదిగా పిలుస్తారు. తరచూ వరదలకు కారణమై ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుండటంతో కోసి నదిని 'బీహార్ దుఃఖదాయిని'గా పేర్కొంటారు.
వివరాలు
బీహార్, యూపీల్లో ప్రభుత్వం అప్రమత్తం..
నేపాల్ వరదల నేపథ్యంలో బీహార్, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
నదీ పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టాలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
నేపాల్ నుంచి భారత మైదాన ప్రాంతాల్లోకి ప్రవహించే ప్రధాన నదుల్లో గండక్ (నారాయణి), కోసి ఉన్నాయి.
బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి మాట్లాడుతూ.. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
బీహార్, యూపీల్లో ప్రభుత్వం అప్రమత్తం..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.
అవసరమైతే తానే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని పేర్కొన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు ఉత్తర్ప్రదేశ్లోని మహారాజ్గంజ్, కుషీనగర్ జిల్లాలను కూడా అప్రమత్తం చేసినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
గండక్, నారాయణి నదుల్లో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.