Chandrababu: 13న పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు..
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించి సమీక్షించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అదే రోజు పోలవరం టూరిజం హబ్కు సంబంధించిన డిజైన్లను పరిశీలించి తుది రూపు ఇవ్వనున్నారని వెల్లడించారు. పోలవరం స్పిల్వే రూపకల్పనలో తెలుగు సంస్కృతి, రాష్ట్ర వైభవం ప్రతిబింబించేలా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి చెప్పారు. సీఎం సూచనలకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్లు సిద్ధం చేస్తున్నామని వివరించారు. గోదావరి నది గొప్పతనాన్ని, చారిత్రక ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే జలక్రీడలు, ఆధ్యాత్మిక పర్యాటకం, రిసార్టులు, ఎమ్యూజ్మెంట్ పార్కుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.
వివరాలు
జాతీయ రహదారులు 365బీబీ, 516ఈలను అనుసంధానించే ప్రణాళిక
జాతీయ రహదారులు 365బీబీ, 516ఈలను అనుసంధానించే ప్రణాళికలో భాగంగా పోలవరం ప్రాజెక్టును కూడా చేర్చుతున్నామని మంత్రి వెల్లడించారు. దీంతో ప్రాజెక్టుకు రహదారి అనుసంధానం మెరుగుపడి పర్యాటక రంగ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం టూరిజం హబ్ అభివృద్ధి అంశంపై జపాన్కు చెందిన నిప్పాన్ కోయి ఏజెన్సీ ప్రతినిధులతో వెలగపూడి సచివాలయంలో గురువారం మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వివరాలను వెల్లడించారు.