Swine Flu: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కలకలం.. మూడు వేలకు చేరిన కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు నగరంలో దాదాపు 3,000 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్వైన్ ఫ్లూ వ్యాప్తి, నివారణ చర్యలు, ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా మంగళవారం ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పలువురు మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నగరంలో వైరస్ వ్యాప్తి పరిస్థితి, ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య, వారికి అందుతున్న చికిత్స తదితర అంశాలపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వివరాలు
పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా నియంత్రణలోనే ఉంది: పంకజ్ సింగ్
స్వైన్ ఫ్లూ బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సీఎం రేఖా గుప్తా అధికారులను ఆదేశించారు.
ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అవసరమైన ప్రాంతాల్లో అదనపు పడకలను ఏర్పాటు చేసి, వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
సమీక్షా సమావేశం అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో స్వైన్ ఫ్లూ పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా నియంత్రణలోనే ఉందని తెలిపారు.
కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
వివరాలు
ఈ లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళండి: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని చెప్పారు.
స్వైన్ ఫ్లూ చికిత్సకు అవసరమైన మందులతో పాటు అత్యవసర వైద్య పరికరాల నిల్వలు కూడా తగినంతగా ఉన్నాయని మంత్రి పంకజ్ సింగ్ వెల్లడించారు.
ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని కోరారు.
సొంతంగా మందులు వేసుకోకుండా వైద్యుల సూచన మేరకే చికిత్స, ఔషధాలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.