26/11 Mumbai attacks: ముంబై ఉగ్రదాడికి 15ఏళ్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
26/11/2008.. ఈ తేదీ దేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు. వాణిజ్య నగరం ముంబై రక్తమోడిన దినం. దేశ చరిత్రలోనే అది పెద్ద ఉగ్రదాడి జరిగి ఆదివారం నాటికి 15ఏళ్లు అవుతోంది. ఆనాటి భయానక పరిస్థితులు తలుచుకొని, ఇప్పటికీ ముంబై వాసులు వణికిపోతున్నారు. నాటి ఉగ్రదాడిలో 166 మంది మరణించగా, మరో 300 మందికి పైగా గాయపడ్డారు. అయితే దేశ చరిత్రలో బ్లాక్ డేగా చెప్పుకునే 26/11 నాటి ముంబై ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన 107వ ఎడిషన్ 'మన్ కీ బాత్' సందర్భంగా స్పందించారు. అమరవీరులను స్మరించుకున్నారు.
అమరవీరులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే నివాళులు
26/11 నాటి ఘటనను చాలా భయంకరమైన ఉగ్రదాడిగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. నవంబర్ 26ను మనం ఎప్పటికీ మరచిపోలేమన్నారు. ఈ రోజు దేశం మొత్తం అమరవీరులైన వీర జవాన్లను స్మరించుకుంటోందన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ సంఘటన భయంకరమైన చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈ దారుణానికి ప్లాన్ చేసిన వారికి శిక్ష విధించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎస్ జైశంకర్ అన్నారు. 26/11 ఉగ్రవాదులతో పోరాడి అసువులు బాసిన అమరవీరులకు మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.