Loading...
Kadapa to Kurnool: కడప నుంచి కర్నూలు వరకు ఖనిజ సంపద.. లిథియం, గాలియంపై అన్వేషణ
కడప నుంచి కర్నూలు వరకు ఖనిజ సంపద.. లిథియం, గాలియంపై అన్వేషణ

Kadapa to Kurnool: కడప నుంచి కర్నూలు వరకు ఖనిజ సంపద.. లిథియం, గాలియంపై అన్వేషణ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

కడప నుంచి కర్నూలు వరకు విస్తరించి ఉన్న కడప బేసిన్‌లో అత్యంత విలువైన లిథియం, గాలియం ఖనిజ నిల్వలు ఉండే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైంది. వైఎస్సార్‌ కడప జిల్లాలోని తుమ్మలపల్లి ప్రాంతంలో చేపట్టిన అన్వేషణలో ఈ ఖనిజాల ఆనవాళ్లు బయటపడ్డాయి. వైఎస్సార్‌ కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లిలో యూసీఐఎల్‌ ప్రాజెక్ట్‌ ఉంది. ఇక్కడ అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ (ఏఎండీ) యురేనియం కోసం తవ్వకాలు నిర్వహిస్తోంది. ఈ తవ్వకాలలో లభించిన కొన్ని నమూనాలను ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు పరిశీలించారు. వాటిలో గరిష్ఠంగా 1,000 పీపీఎం వరకు లిథియం, 250 పీపీఎం వరకు గాలియం ఉన్నట్లు గుర్తించారు.

వివరాలు 

200 కి.మీ. మేర సమగ్ర అన్వేషణ

కడప బేసిన్‌ వైఎస్సార్‌ కడప జిల్లాలోని వేముల, వేంపల్లి ప్రాంతాల నుంచి కర్నూలు జిల్లా వరకు సుమారు 200 కి.మీ. మేర విస్తరించి ఉంది.

ఈ మొత్తం ప్రాంతంలో లిథియం, గాలియం నిల్వల ఉనికిని గుర్తించేందుకు నాలుగు దశల్లో సమగ్ర అన్వేషణ చేపట్టాలని నిర్ణయించారు.

ఈ మేరకు ఎన్‌జీఆర్‌ఐ, రాష్ట్ర గనుల శాఖ మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది.

మొదటి దశలో ప్రాంతంలోని నేల స్వభావం, బావుల్లోని నీరు, గతంలో బావులు తవ్వినప్పుడు బయటకు వచ్చిన రాతి ముక్కలు, బోర్లు వేసిన సమయంలో వెలికివచ్చిన మట్టి తదితరాలను పరిశీలిస్తారు. ఈ ప్రాథమిక సర్వేను జీ-4 దశగా పిలుస్తారు.

వివరాలు 

200 కి.మీ. మేర సమగ్ర అన్వేషణ

ఆ తర్వాత ప్రతి 700-800 మీటర్లకు ఒక బోర్‌హోల్‌ చొప్పున వేసి భూగర్భం నుంచి మట్టి, రాతి నమూనాలను బయటకు తీసి అధ్యయనం చేస్తారు.

ఇది జీ-3 దశ. ఈ పరిశీలనల్లో ఖనిజ నిల్వలు ఉన్నట్లు నిర్ధారణ అయితే మరింత దగ్గరగా బోర్‌హోల్స్‌ వేస్తారు.

మొదట 350-400 మీటర్ల దూరానికి ఒకటి చొప్పున, అనంతరం 200 మీటర్ల దూరానికి ఒకటి చొప్పున బోర్లు వేసి లోతైన అధ్యయనం నిర్వహిస్తారు.

తద్వారా ఖనిజ నిల్వలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, వాటి పరిమాణం ఎంత అనే విషయాలను అంచనా వేస్తారు. ఈ ప్రక్రియను జీ-2 దశగా పేర్కొంటారు.

ADVERTISEMENT

వివరాలు 

200 కి.మీ. మేర సమగ్ర అన్వేషణ

చివరి దశలో ఖనిజాన్ని వెలికితీసేందుకు అనువైన శాస్త్రీయ పద్ధతులను సూచిస్తారు.

ఏ విధానంలో తవ్వకాలు చేపడితే ఖనిజాన్ని సమర్థంగా వెలికితీయవచ్చో ఈ దశలో నిర్ధారిస్తారు.

దీనిని జీ-1 దశ అంటారు. జీ-4 నుంచి జీ-1 వరకు మొత్తం ప్రక్రియను ఎన్‌జీఆర్‌ఐ, రాష్ట్ర గనుల శాఖ సంయుక్తంగా చేపట్టనున్నాయి.

ఈ ఖనిజాన్వేషణకు సుమారు రూ.140 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఇందుకు జాతీయ ఖనిజాన్వేషణ ట్రస్ట్‌ నిధులను వినియోగించనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

లక్షల కోట్ల విలువైన సంపద?

తుమ్మలపల్లి వద్ద ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించిన ప్రాంతంలో పైభాగంలో లిథియం, దాని కింద గాలియం ఉన్నట్లు గుర్తించారు.

అయితే బేసిన్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో ఖనిజాలు ఉంటాయని చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో లిథియం, గాలియం రెండూ కలిసి ఉండొచ్చని, మరికొన్ని ప్రాంతాల్లో వీటిలో ఏదో ఒక ఖనిజం మాత్రమే ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

మొత్తంగా సుమారు 8 లక్షల టన్నుల వరకు లిథియం, గాలియం నిల్వలు ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఇవి నిర్ధారణ అయితే వాటి విలువ లక్షల కోట్ల రూపాయల మేర ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

వివరాలు 

లిథియంకు భారీ డిమాండ్

లిథియం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన ఖనిజాల్లో ఒకటిగా మారింది. బ్యాటరీల తయారీలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు.

ముఖ్యంగా విద్యుత్‌ వాహనాల బ్యాటరీలు, విద్యుత్‌ నిల్వ వ్యవస్థలకు లిథియం అవసరం.

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఖనిజానికి ప్రాధాన్యం మరింత పెరిగింది.

వివరాలు 

గాలియంతో ఆధునిక సాంకేతికత

గాలియం కూడా ఆధునిక సాంకేతిక రంగాలకు అత్యంత అవసరమైన ఖనిజం.

ఎలక్ట్రానిక్స్‌, ఏవియేషన్‌ రంగాల్లో దీనికి విస్తృత వినియోగం ఉంది. సెమీకండక్టర్ల తయారీ, రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్స్‌, రాడార్‌ నెట్‌వర్క్స్‌లో గాలియాన్ని ఉపయోగిస్తారు.

అంతేకాదు.. ఎల్‌ఈడీ స్క్రీన్లు, సోలార్‌ ప్యానళ్ల తయారీలోనూ గాలియం కీలక పాత్ర పోషిస్తుంది.

అందువల్ల కడప బేసిన్‌లో లిథియం, గాలియం నిల్వలు భారీ స్థాయిలో ఉన్నట్లు సమగ్ర అన్వేషణలో నిర్ధారణ అయితే.. దేశ పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు ఈ ప్రాంతం నుంచి లభించే ఖనిజ సంపద ఎంతో కీలకంగా మారే అవకాశం ఉంది.

ADVERTISEMENT