Loading...
Karnataka: కర్ణాటకలో వేడెక్కిన రాజకీయాలు.. నాగేంద్రకు బిగిసిన ఉచ్చు.. బీజేపీ ఆందోళనల వేళ రాజీనామాకు సిద్ధం?
బీజేపీ ఆందోళనల వేళ రాజీనామాకు సిద్ధం?

Karnataka: కర్ణాటకలో వేడెక్కిన రాజకీయాలు.. నాగేంద్రకు బిగిసిన ఉచ్చు.. బీజేపీ ఆందోళనల వేళ రాజీనామాకు సిద్ధం?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2026
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. గిరిజన సంక్షేమ శాఖలో అక్రమాల ఆరోపణల కేసులో నిందితుడిగా ఉన్న మంత్రి బి.నాగేంద్ర తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ వ్యవహారంపై విపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతోపాటు, ఆయనను మంత్రివర్గంలో కొనసాగించడంపై కాంగ్రెస్‌లోని కొందరు నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో నాగేంద్ర మంగళవారం ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. తనను మంత్రివర్గంలో కొనసాగించడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందని ఆయన సీఎంకు వివరించినట్లు తెలుస్తోంది. బీజేపీ తనను లక్ష్యంగా చేసుకుంటోందని, పార్టీ ప్రతిష్ఠను కాపాడేందుకు అవసరమైతే మంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని నాగేంద్ర చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

వివరాలు 

నిందితుడినే.. దోషిగా నిర్ధారణ కాలేదు:  నాగేంద్ర

నాగేంద్రను మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఇప్పటికే ఆందోళనలకు దిగింది.

రాయచూర్‌ నుంచి బళ్లారి వరకు భారీ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. అసెంబ్లీలోనూ ఈ అంశంపై పలుమార్లు బీజేపీ నిరసనలు చేపట్టింది.

నాగేంద్ర వ్యవహారం కారణంగా అసెంబ్లీ సమావేశాలు సైతం అనూహ్యంగా ముగిసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, తనపై వచ్చిన ఆరోపణలపై నాగేంద్ర ఇటీవల స్పందించారు.

ఈ కేసులో తాను కేవలం నిందితుడినేనని, ఇప్పటివరకు దోషిగా నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు.

తాను దళిత నాయకుడిననే కారణంతోనే విపక్షాలు తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపించారు.

వివరాలు 

హైకమాండ్‌ అనుమతి కోసం శివకుమార్‌ ఎదురుచూపులు

నాగేంద్ర రాజీనామా అంశాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళతానని డీకే శివకుమార్‌ చెప్పినట్లు సమాచారం.

హైకమాండ్‌ నుంచి అనుమతి వచ్చిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తే బుధవారం నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశముందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు, ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నాగేంద్రను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై కూడా కొందరు నేతలు ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలుస్తోంది.

దీంతో ఈ వ్యవహారం పార్టీ అంతర్గతంగా కూడా చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు 

సెప్టెంబర్‌ 1 నుంచి బీజేపీ 200 కి.మీ. పాదయాత్ర

సెప్టెంబర్‌ 1 నుంచి 10వ తేదీ వరకు రాయచూర్‌ నుంచి బళ్లారి వరకు సుమారు 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ ప్రకటించింది.

నాగేంద్ర స్వస్థలం బళ్లారి కావడంతో.. ఆయన రాజీనామాను ఈ పాదయాత్రలో ప్రధాన డిమాండ్‌గా బీజేపీ ముందుకు తీసుకెళ్లనుంది.

దీంతో నాగేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతారా? లేక రాజీనామా చేస్తారా? అనే అంశంపై కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

ADVERTISEMENT