Page Loader
Medigadda barrage: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో,నిర్వహణలో, నాణ్యతలోనూ వైఫల్యాలు.. తుది నివేదికలో 'విజిలెన్స్‌'
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో,నిర్వహణలో, నాణ్యతలోనూ వైఫల్యాలు.. తుది నివేదికలో 'విజిలెన్స్‌'

Medigadda barrage: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో,నిర్వహణలో, నాణ్యతలోనూ వైఫల్యాలు.. తుది నివేదికలో 'విజిలెన్స్‌'

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2025
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, నిర్వహణ, నాణ్యతలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తన తుది నివేదికలో పేర్కొంది. ఈ లోపాలకు నిర్మాణ సంస్థ, సంబంధిత ఇంజినీర్లు బాధ్యత వహించాలని స్పష్టం చేస్తూ, నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత, దీని పై విచారణ చేపట్టేందుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం రంగంలోకి దిగింది. విచారణలో పని పూర్తికాకముందే సర్టిఫికెట్‌ మంజూరు చేయడం, బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేయడం, నాణ్యత తనిఖీలు సరైన విధంగా జరగకపోవడం, ఒప్పందం ప్రకారం ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (O&M) లేకపోవడం, గుత్తేదారు పనులను పరిశీలించకపోవడం వంటి అనేక లోపాలు బయటపడ్డాయి.

వివరాలు 

బాధ్యులైన ఇంజినీర్లపై క్రిమినల్‌ చర్యలు

ప్రాథమిక నివేదిక ఆధారంగా, ఎల్‌ అండ్‌ టీ - పీఈఎస్‌ జాయింట్‌ వెంచర్‌ సంస్థతో పాటు బాధ్యులైన ఇంజినీర్లపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ సిఫార్సు చేసింది. ఈ నివేదికను కాళేశ్వరపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు ప్రభుత్వం అందజేసింది. జస్టిస్‌ ఘోష్‌ కమిషన్ మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా పరిశీలించి తుది నివేదిక ఇవ్వాలని సూచించింది. దీని ప్రకారం, నాలుగు రోజుల క్రితం ఈ మూడు బ్యారేజీలపై తుది నివేదికను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసింది. అనంతరం, తదుపరి చర్యల కోసం నీటిపారుదల శాఖకు నివేదికను పంపినట్లు సమాచారం.

వివరాలు 

ఇంజినీర్ల నిర్లక్ష్యం - కేవలం లేఖలు రాయడమే! 

2019లో మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభమైనప్పటి నుండి, డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లో చేపట్టాల్సిన మరమ్మతులు చేయకపోవడం, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కేవలం లేఖలు రాయడానికే పరిమితమై, ఎలాంటి కార్యాచరణ చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తుది నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. కీలక లోపాలు: నీటిపారుదల శాఖ, కాంట్రాక్టు సంస్థ - O&M మార్గదర్శకాలను పాటించలేదు. డ్యాం సేఫ్టీ చట్టం - 2021 అమలు కాలేదు. కాఫర్‌డ్యాం తొలగించలేదు. డీ-వాటరింగ్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. కాంట్రాక్టర్‌కు అనుచిత ప్రయోజనాలు కల్పించారు. విజిలెన్స్‌ నివేదికలో, బాధ్యులైన ఇంజినీర్లు ఏయే దశల్లో వైఫల్యం చెందారు, ఎల్‌ అండ్‌ టీ ఎక్కడ నిర్లక్ష్యం చేసింది వంటి వివరాలను స్పష్టంగా పొందుపరిచారు.

వివరాలు 

ఇంకా చర్యలు తీసుకునేనా? 

పని పూర్తికాకముందే సర్టిఫికెట్‌ ఇచ్చిన ఇద్దరు ఇంజినీర్లపై విజిలెన్స్‌ ప్రాథమిక నివేదిక ఆధారంగా నీటిపారుదల శాఖ వివరణ కోరింది. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. తాజా తుది నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే!