PM Modi: మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో నాణ్యతపై మోదీ సీరియస్.. అధికారులకు కీలక సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టుల నాణ్యతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం పేరుతో నాణ్యత ప్రమాణాలను విస్మరించకూడదని స్పష్టం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో నిర్వహించిన 53వ ప్రగతి(PRAGATI) సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' నివేదించింది. ప్రాజెక్టుల్లో నాణ్యత లోపాలను గుర్తించి సరిదిద్దడంలో ప్రస్తుతం ఉన్న థర్డ్ పార్టీ ఆడిట్లు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని మోదీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అవసరమైన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా తెలుసుకునేందుకు'ఫోర్త్ పార్టీ ఆడిట్'కూడా అవసరమా? అని ఆయన అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఇలాంటి పరిస్థితి ఉండటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రధాని పేర్కొన్నట్లు తెలిసింది.
వివరాలు
ప్రాజెక్టుల వేగం పెంచినా.. నాణ్యతలో రాజీ వద్దు: పీఎంవో
ప్రగతి సమావేశంలో రైల్వేలు, రహదారులు, విద్యుత్ రంగాలకు సంబంధించిన ఆరు మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రధాని మోదీ సమీక్షించారు.
తొమ్మిది రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.30,000 కోట్లకు పైగా ఉంది.
పనులు వేగంగా సాగడంతో పాటు నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని మోదీ స్పష్టం చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తెలిపింది.
ప్రాజెక్టుల నాణ్యతను మెరుగ్గా పర్యవేక్షించేందుకు ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాలని సంబంధిత మంత్రిత్వ శాఖలకు ప్రధాని సూచించారు.
అలాగే ప్రాజెక్టులను విడివిడిగా కాకుండా మొత్తం ప్రాజెక్టును ఒకే వ్యవస్థగా పరిగణించి పర్యవేక్షించాలని అన్నారు.
వివరాలు
ప్రధాన రవాణా ప్రాజెక్టుల్లో ఉమ్మడి యుటిలిటీ కారిడార్లు
విద్యుత్ రంగానికి సంబంధించిన ఓ ప్రాజెక్టును సమీక్షించే సమయంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ఒక్కటే సరిపోదని మోదీ అన్నారు.
దానికి తగిన ప్రసార సామర్థ్యాన్ని కూడా ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు.
కాలువలు నిర్మించకుండా కేవలం ఆనకట్టలు నిర్మిస్తే ఆశించిన ఫలితం రాదని చెప్పినట్లుగా.. విద్యుత్ ఉత్పత్తితో పాటు దాన్ని సరఫరా చేసే వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని వివరించారు.
అలాగే ప్రధాన రవాణా ప్రాజెక్టుల్లో ఉమ్మడి యుటిలిటీ కారిడార్ల ఏర్పాటును పరిశీలించాలని ప్రధాని సూచించారు.
దీనివల్ల ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే అడ్డంకులను తగ్గించడంతో పాటు పనులు సజావుగా ముందుకు సాగుతాయని అన్నారు.
ముందుగానే సమన్వయం చేసుకోవడం ద్వారా నివారించగల జాప్యాలను కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
వివరాలు
సైబర్ నేరాలపై ముందస్తు చర్యలు చేపట్టాలి: మోదీ
ప్రాజెక్టుల నిర్వహణలో కేంద్ర మంత్రిత్వ శాఖలు,రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ముందుచూపుతో వ్యవహరించాలని ప్రధాని మోదీ సూచించారు.
సమస్యలు తలెత్తిన తర్వాత స్పందించడం కాకుండా.. అవి ఎదురయ్యే అవకాశాలను ముందుగానే గుర్తించి పరిష్కార మార్గాలను సిద్ధం చేసుకోవాలని అన్నారు.
తద్వారా ప్రాజెక్టుల గడువులు ప్రభావితం కాకుండా చూడవచ్చని పేర్కొన్నారు.
సమావేశంలో సైబర్ నేరాలు,ముఖ్యంగా 'డిజిటల్ అరెస్ట్' పేరుతో జరుగుతున్న మోసాలపై కూడా చర్చ జరిగింది.
ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలను మరింత బలోపేతం చేయాలని మోదీ సూచించారు.
అవగాహన కార్యక్రమాలు, ప్రజలకు సమాచారాన్ని అందించడం, శిక్షణ వంటి చర్యలను విస్తృతంగా చేపట్టాలని అన్నారు.
ముఖ్యంగా వృద్ధులు, యువత వంటి సైబర్ మోసాలకు సులభంగా గురయ్యే వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు.