PM In UAE: నేడు అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం అబుదాబిలో తొలి హిందూ రాతి దేవాలయం బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) మందిర్ను బుధవారం మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఫిబ్రవరి 13న యూఏఈకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి విమానాశ్రయంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. 2015 తర్వాత ప్రధాని యూఏఈలో పర్యటించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కాగా గత ఎనిమిది నెలల్లో ఇది మూడోది.
మోదీ-షేక్ మహ్మద్ మధ్య ద్వైపాక్షిక చర్చలు
ప్రధాని మోదీ మంగళవారం యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా, విస్తరింపజేసేందుకు, బలోపేతం చేసేందుకు గల మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. హిందూ దేవాలయం నిర్మాణానికి భూమిని మంజూరు చేయడంలో సహకరించినందుకు యూఏఈ అధ్యక్షుడికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆలయానికి భూమిని యూఏఈ ప్రభుత్వం విరాళంగా ఇవ్వడంపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. యూఏఈలో తన రెండు రోజుల పర్యటన ముగించుకుని బుధవారం మధ్యాహ్నం మోదీ దోహాకు వెళ్లనున్నారు.