Ram Mandir donor's: రూ.3 బ్యాలెన్స్తో రామమందిరానికి రూ.4 కోట్ల చెక్కు.. అసలు కథ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్యలోని రామమందిరానికి సంబంధించిన ఓ ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆలయ సిబ్బంది సంక్షేమం, వారికి అవసరమైన సౌకర్యాల కోసం చెన్నైకి చెందిన ఓ మహిళా భక్తురాలు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు రూ.4 కోట్ల చెక్కును అందించారు. అయితే ఆ చెక్కును ట్రస్ట్ బ్యాంకులో జమ చేయడంతో అసలు విషయం బయటపడింది. సదరు మహిళ బ్యాంకు ఖాతాలో కేవలం రూ.3 మాత్రమే ఉన్నట్లు తేలింది. దీంతో తగినంత నిధులు లేక చెక్కు బౌన్స్ అయింది.
వివరాలు
ఉద్యోగుల సౌకర్యాల కోసమే ఖర్చు చేయాలని..
తాను ఇస్తున్న రూ.4 కోట్లను రామమందిరంలో పనిచేసే ఉద్యోగుల వసతులు,సంక్షేమం కోసమే వినియోగించాలని మహిళ ట్రస్ట్ను కోరినట్లు సమాచారం.
అంతేకాకుండా ఈ మొత్తాన్ని అదే అవసరాలకు ఖర్చు చేస్తామని ట్రస్ట్ నుంచి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కూడా ఆమె అడిగినట్లు తెలుస్తోంది.
అయితే ట్రస్ట్ మాత్రం అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని సమాచారం.
మరోవైపు, సదరు మహిళ ఆలయానికి ప్రత్యేకంగా మరో రూ.10వేల విరాళాన్ని కూడా అందించినట్లు తెలిసింది.
ఖాతాలో సరిపడా నగదు లేకపోయినా రూ.4 కోట్లకు చెక్కు జారీ చేసిన వ్యవహారంపై బ్యాంకు అధికారులు ఆమెకు నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నిబంధనల ప్రకారం ఆమె నుంచి వివరణ కోరడంతో పాటు, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
వివరాలు
సమస్య పరిష్కారానికి ట్రస్ట్ ప్రయత్నాలు
చెక్కు బౌన్స్ అయిన విషయం బయటకు రావడంతో ట్రస్ట్ ప్రతినిధులు సదరు మహిళతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ ఘటనపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వివరాలు
2020లోనూ భారీగా చెక్కులు బౌన్స్
రామమందిర నిర్మాణం కోసం 2020లో నిర్వహించిన నిధి సమర్పణ ప్రచార సమయంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
సాంకేతిక, ఇతర కారణాలతో అప్పట్లో దాదాపు రూ.100 కోట్ల విలువైన చెక్కులు బౌన్స్ అయినట్లు సమాచారం.
వాటిలో ఎక్కువ మొత్తాన్ని అనంతరం రికవరీ చేసినప్పటికీ, సుమారు రూ.22 కోట్ల విలువైన చెక్కుల మొత్తం మాత్రం ఇంకా రికవరీ కావాల్సి ఉన్నట్లు తెలిసింది.
వివరాలు
ప్రస్తుతం ఆలయానికి భారీగా విరాళాలు
ప్రస్తుతం రామమందిరానికి ప్రతి నెల నగదు, ఆన్లైన్, చెక్కుల రూపంలో కలిపి సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు విరాళాలు అందుతున్నట్లు సమాచారం.
ఇందులో చెక్కుల ద్వారా వచ్చే విరాళాల విలువే నెలకు దాదాపు రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
తాజాగా రూ.4 కోట్ల చెక్కు బౌన్స్ అయిన నేపథ్యంలో, భారీ మొత్తాల విరాళాల చెక్కులను స్వీకరించడం, క్లియర్ చేయడంలో ట్రస్ట్ ఇకపై మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.