Page Loader
SLBC Tunnel: కార్మికుల జాడ గుర్తించేందుకు జీపీఆర్‌ సహాయంతో సిగ్నళ్లు..  

SLBC Tunnel: కార్మికుల జాడ గుర్తించేందుకు జీపీఆర్‌ సహాయంతో సిగ్నళ్లు..  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2025
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో కార్మికుల జాడ తెలుసుకోవడానికి జీపీఆర్‌ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) సహాయంతో సిగ్నళ్లను పంపించగా,8 ప్రదేశాల నుంచి బలమైన సిగ్నళ్లు ప్రతిబింబించాయి. ఆ ప్రదేశాల లోతును లెక్కించి,ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందానికి వివరాలను అందజేశాం.ఆయా ప్రాంతాల్లో మార్కింగ్‌ చేసి, రెండు చోట్ల తవ్వకాలు చేపట్టగా, యంత్ర పరికరాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతాలను పక్కన పెట్టి మిగతా ఆరు చోట్ల తవ్వకాలు కొనసాగించాలని సూచించాం. త్వరలో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం''అని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం. సత్యనారాయణ తెలిపారు. వారంపాటు సహాయ చర్యల్లో పాలుపంచుకున్న ఆయన తన కార్యాలయానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా, తన అనుభవాలను ప్రముఖ మీడియాతో పంచుకున్నారు.

వివరాలు 

 కార్మికుల జాడ కోసం 200మెగాహెర్ట్జ్‌ సిగ్నళ్లు 

''జీపీఆర్‌ ద్వారా ఎలక్ట్రోమాగ్నటిక్‌ కిరణాలను పంపించి, వస్తువులను గుర్తిస్తాం. ఏరోస్పేస్‌ రంగంలో ఈ రాడార్‌ సహాయంతో శత్రువుల విమానాలను గుర్తిస్తారు. అక్కడ ఆకాశంలో ఉన్న వస్తువు ఒకటే అవుతుంది. తాకి తిరిగి వచ్చిన సిగ్నళ్ల ఆధారంగా ఆ వస్తువును ఖచ్చితంగా గుర్తించగలుగుతాం. ఇదే విధంగా భూమి లోపల సిగ్నళ్లను పంపించి, అక్కడ ఉన్న పొరల్లో ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేశాం. సొరంగంలో కార్మికుల జాడ తెలుసుకోవడానికి 200మెగాహెర్ట్జ్‌ సిగ్నళ్లను పంపించాం.ఈ సిగ్నళ్లు భూమి లోపలికి వెళ్లి,ఏదైనా అడ్డంకి ఉంటే వెనక్కి ప్రతిబింబిస్తాయి.వచ్చే సిగ్నళ్ల తీవ్రతను విశ్లేషించి, లక్ష్యభూమి ఎక్కడ ఉందో మ్యాప్‌ చేస్తాం. తవ్వకాల్లో డ్రిల్లింగ్‌ యంత్ర భాగాలు బయటపడ్డాయి. ఈ యంత్ర భాగాల నుండి ప్రతిబింబించిన సిగ్నళ్లను కూడా విశ్లేషించాం.

వివరాలు 

సొరంగం కొండ క్రింద 500 మీటర్ల లోతులో..

టన్నెల్‌ లోపల మాత్రమే కాకుండా, కూలిన ప్రదేశాన్ని కొండ పైనుంచీ గుర్తించేందుకు ప్రయత్నించాం.టైమ్‌ డొమైన్‌ ఎలక్ట్రో మాగ్నటిక్‌ సాంకేతికత ద్వారా భూమి పొరలను పరిశీలించాం. 200 మీటర్ల లోతు వరకు వివరాలు పొందగలిగాం. అయితే, సొరంగం కొండ క్రింద 500 మీటర్ల లోతులో ఉంది. మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటే, ప్రభుత్వ సూచన మేరకు ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నాం'' అని సత్యనారాయణ వివరించారు.