Amit Shah: 'ఇది ధర్మశాల కాదు'.. అక్రమ చొరబాట్లపై అమిత్ షా తీవ్ర హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించాలంటే దేశ అంతర్గత భద్రత పటిష్ఠంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చొరబాట్లు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు భవిష్యత్లో ఎదురయ్యే కొత్త భద్రతా సవాళ్లను ముందుగానే గుర్తించి వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఢిల్లీలో జరిగిన ఇంటెలిజెన్స్ బ్యూరో 'జాతీయ భద్రతా సదస్సు' ముగింపు సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముప్పు ముంచుకొచ్చేలోపే ఎదుర్కోవాలి రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో దేశానికి ఎదురయ్యే భద్రతా సవాళ్లను ఇప్పటి నుంచే అంచనా వేయాలని అమిత్ షా అన్నారు. అవి తీవ్రమైన సంక్షోభాలుగా మారకముందే వాటిని అడ్డుకునేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
వివరాలు
'భారత్ ధర్మశాల కాదు'
దేశంలో అంతర్గత భద్రతకు సంబంధించిన మూడు ప్రధాన హాట్స్పాట్ల నుంచి వచ్చిన ముప్పులను సమర్థంగా ఎదుర్కొన్నామని తెలిపారు.
సరిహద్దుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అమిత్ షా చెప్పారు.
గత ఎనిమిది నెలలుగా భూ సరిహద్దులు కలిగిన అన్ని రాష్ట్రాలతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు వెల్లడించారు.
సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేసేందుకు నాలుగు అంచెల భద్రతా ప్రణాళికను రాష్ట్రాలకు అందించినట్లు తెలిపారు.
''భారత్ ధర్మశాల కాదు.ఈ దేశ పౌరులకు మాత్రమే ఇక్కడ నివసించే హక్కు ఉంది'' అని అమిత్ షా స్పష్టం చేశారు.
అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారు జాతీయ భద్రతకు మాత్రమే కాకుండా ఆర్థిక స్థిరత్వం, జనాభా సమతుల్యతకు కూడా ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
వివరాలు
మూడేళ్లలో క్రిమినల్ కేసుల పరిష్కారం
ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలను వచ్చే ఏడాదిలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమిత్ షా తెలిపారు.
క్రిమినల్ కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్లినా మూడేళ్లలోపు పరిష్కారమయ్యేలా న్యాయవ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
శిక్షలు పడే కేసుల శాతాన్ని 25 శాతం పెంచడం కూడా తమ లక్ష్యాల్లో ఒకటని వెల్లడించారు.
వివరాలు
ఉగ్రవాదం, డ్రగ్స్పై కఠిన చర్యలు
పీఎఫ్ఐపై నిషేధం తర్వాత కేంద్రం, రాష్ట్రాలు కలిసి చేపట్టిన చర్యలను అమిత్ షా సమన్వయానికి మంచి ఉదాహరణగా పేర్కొన్నారు.
ఉగ్రవాద నెట్వర్క్లను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు 'ప్రహార్' వ్యూహాన్ని రోజువారీ భద్రతా కార్యకలాపాల్లో భాగం చేయాలని అధికారులకు సూచించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు 'డిటెక్ట్, డిస్రప్ట్, డిస్ట్రాయ్' విధానాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.
2026-29 మాదకద్రవ్య నియంత్రణ విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న కార్యాచరణను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు.
వివరాలు
ఏఐతో భవిష్యత్ ముప్పులపై నిఘా
సీసీటీఎన్ఎస్, ఐసీజేఎస్, నాట్గ్రిడ్, నాఫిస్ వంటి డేటాబేస్లను అనుసంధానం చేయడం ద్వారా దేశంలో మరింత శక్తిమంతమైన నిఘా వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని అమిత్ షా తెలిపారు.
కృత్రిమ మేధ (ఏఐ), డేటా విశ్లేషణ, వ్యక్తుల ప్రవర్తనా సరళి అధ్యయనం వంటి సాంకేతికతలను ఉపయోగించి భవిష్యత్ ముప్పులను అవి ఎదురయ్యేలోపే గుర్తించాలని యువ భద్రతా అధికారులకు సూచించారు.