LOADING...
52 new spy satellites: అంతరిక్ష భద్రతపై భారత్‌ భారీ అడుగు.. 50కి పైగా కొత్త స్పై శాటిలైట్లు
అంతరిక్ష భద్రతపై భారత్‌ భారీ అడుగు.. 50కి పైగా కొత్త స్పై శాటిలైట్లు

52 new spy satellites: అంతరిక్ష భద్రతపై భారత్‌ భారీ అడుగు.. 50కి పైగా కొత్త స్పై శాటిలైట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతల్లో నిఘా పరిమితులు స్పష్టంగా బయటపడటంతో, భారత్‌ తన సైనిక ఉపగ్రహ వ్యవస్థను భారీగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. రాత్రి సమయంలో,మేఘావృత వాతావరణంలో కూడా స్పష్టమైన చిత్రాలు అందించే సామర్థ్యంతో 50కి పైగా కొత్త గూఢచారి ఉపగ్రహాలను ప్రయోగించాలన్న యోచనలో ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. గతేడాది మే 7 నుంచి మే 10 వరకు పాకిస్తాన్‌తో జరిగిన నాలుగు రోజుల సైనిక ప్రతిష్టంభనలో భారత ఉపగ్రహాల పరిమితులు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో లక్ష్యాలను గుర్తించడంలో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించినప్పటికీ, రాత్రివేళల్లోనూ, దట్టమైన మేఘాలు ఉన్నప్పుడు భారత ఉపగ్రహాలు ఆశించిన స్థాయిలో పని చేయలేకపోయాయి.

వివరాలు 

అమెరికాకు చెందిన ప్రైవేట్‌ సంస్థల నుంచి ఉపగ్రహ చిత్రాల కొనుగోలు

బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం, అన్ని వాతావరణాల్లో పనిచేసే ఇమేజింగ్‌ సామర్థ్యం భారత్‌కు తక్కువగా ఉంది. మరోవైపు, తక్కువ ఉపగ్రహాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్‌కు చైనా ఉపగ్రహాల సహకారం లభించింది. ఆ చైనా వ్యవస్థలు రాత్రి వేళల్లోనూ, మేఘాల మధ్యనూ సమర్థంగా పని చేస్తున్నాయి. ఈ నిఘా లోపాల కారణంగా కొన్ని సందర్భాల్లో భారత్‌కు రోజుల తరబడి సరైన సమాచారం అందలేదు. దాంతో అమెరికాకు చెందిన ప్రైవేట్‌ సంస్థల నుంచి ఉపగ్రహ చిత్రాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇలా ఆధారపడటం వల్ల సైనిక ప్రణాళికల అమలులో ఆలస్యం జరిగిందని రక్షణ వర్గాలు గుర్తించాయి. దీంతో అంతరిక్ష ఆధారిత నిఘాను మరింత బలపర్చాల్సిన అవసరం ఉందని తేల్చాయి.

వివరాలు 

ఉపగ్రహాల మధ్య నేరుగా సమాచార మార్పిడి

ఈ విస్తరణలో కీలకంగా మారనున్నది ఉపగ్రహ సాంకేతికతలో మార్పు. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న ఎలక్ట్రో-ఆప్టికల్‌ ఇమేజింగ్‌ నుంచి, సింథటిక్‌ అపర్చర్‌ రాడార్‌ (SAR) టెక్నాలజీ వైపు భారత్‌ అడుగులు వేస్తోంది. ఈ రాడార్‌ వ్యవస్థలతో రాత్రి వేళల్లోనూ, వర్షాలు, మేఘాలు ఉన్నా స్పష్టమైన చిత్రాలు పొందొచ్చు. దీంతో నిఘాలో కనిపిస్తున్న ఖాళీలు చాలా వరకు తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు. సరిహద్దులు, సున్నిత ప్రాంతాల్లో లక్ష్యాలను వేగంగా గుర్తించే సామర్థ్యం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో ఉపగ్రహాల మధ్య నేరుగా సమాచార మార్పిడిని మెరుగుపరుస్తున్నారు. దీని వల్ల భూమిపై ఉన్న గ్రౌండ్‌ స్టేషన్లపై ఆధారపడటం తగ్గుతుంది. వేగంగా డేటా చేరడం వల్ల సంక్షోభ సమయాల్లో నిర్ణయాలు త్వరగా తీసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

వివరాలు 

మూడు సంవత్సరాల్లో 100 నుంచి 150 ఉపగ్రహాలు 

ఈ ప్రణాళికలో తొలి దశగా 'స్పేస్‌ బేస్డ్‌ సర్వైలెన్స్‌-3' కార్యక్రమం కింద 50కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. గత ఏప్రిల్‌లో ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ మాట్లాడుతూ,ప్రస్తుతం ఉన్న ఉపగ్రహాలు సరిపోవని, దేశ సరిహద్దుల భద్రత కోసం మరెన్నో అవసరమని తెలిపారు. మూడు సంవత్సరాల్లో 100 నుంచి 150 ఉపగ్రహాలను మోహరించడమే లక్ష్యమన్నారు. మొత్తం 150 ఉపగ్రహాల ప్రయోగానికి సుమారు రూ.26 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. గతేడాది జూన్‌లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం ఈ కార్యక్రమానికి వేగం పెంచారు. తొలి దశ ఉపగ్రహాలు 2026 ఏప్రిల్‌ నాటికి ప్రయోగమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

వివరాలు 

ఇస్రోతో పాటు మూడు ప్రైవేట్‌ భారతీయ సంస్థలు నిర్మించే ఉపగ్రహాలు

అక్టోబర్‌లో స్పేస్‌ బేస్డ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ మూడో దశకు క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ ఆమోదం తెలిపింది. ఇందులో ఇస్రోతో పాటు మూడు ప్రైవేట్‌ భారతీయ సంస్థలు నిర్మించే ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇదే కాకుండా, కక్ష్యలోనే ముప్పులను గుర్తించి ఎదుర్కొనే 'బాడీగార్డ్‌ ఉపగ్రహాలు' అభివృద్ధి చేసే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. అలాగే మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా, స్కాండినేవియా వంటి ప్రాంతాల్లో విదేశీ గ్రౌండ్‌ స్టేషన్ల ఏర్పాటుపై కూడా పరిశీలన జరుగుతోంది. ఇవి నిఘా సమాచారాన్ని వేగంగా చేరవేయడంలో సహాయపడతాయి. అయితే, ఈ కేంద్రాల నిర్మాణానికి ఆయా దేశాల అనుమతులు అవసరం అవుతాయి.

Advertisement