ISRO: భూమితో గ్రహాంతర ధూళి రేణువుల ఢీని గుర్తించిన ఇస్రో
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ధూళి రేణువుల డిటెక్టర్ మరో కీలక ఆవిష్కారాన్ని సాధించింది. గ్రహాంతర ధూళి రేణువులు భూమి వాతావరణాన్ని ముంచెత్తుతున్న ప్రక్రియను ఈ సాధనం విజయవంతంగా గుర్తించింది. 'డస్ట్ ఎక్స్పెరిమెంట్' (డెక్స్)గా పిలిచే ఈ ఆధునిక పరికరాన్ని గతేడాది పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ (పోయెమ్)లో భాగంగా ఇస్రో రోదసిలోకి ప్రవేశపెట్టింది. గ్రహాంతర ధూళి రేణువులు అతి సూక్ష్మమైన కణాలు కాగా, ఇవి ప్రధానంగా తోకచుక్కలు, గ్రహశకలాల నుంచి వెలువడుతుంటాయి. భూమి వాతావరణానికి వెలుపల ఉన్న అంతుచిక్కని పొరలో ఈ ధూళి రేణువులు సంచరిస్తుంటాయి.
Details
ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ అభివృద్ధి
డెక్స్ సాధనాన్ని అహ్మదాబాద్లోని ఇస్రో అనుబంధ సంస్థ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. శరవేగంతో దూసుకొచ్చే తారాంతర, గ్రహాంతర ధూళి రేణువులను గుర్తించడంతో పాటు వాతావరణంలో అవి ఎదుర్కొనే రాపిడి ప్రభావాలను కూడా ఈ సాధనం గమనిస్తుంది. డెక్స్ అందించే కీలక శాస్త్రీయ డేటా ద్వారా విశ్వానికి సంబంధించిన కొత్త అంశాలను వెలికితీయడానికి అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో భవిష్యత్తులో చేపట్టే సుదూర అంతరిక్ష మిషన్లను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ సమాచారం దోహదపడనుందని వారు తెలిపారు.