Eng vs Pak: పాక్ ప్లేయర్ను వెక్కిరించిన స్టువర్ట్ బ్రాడ్.. 'కెమెరాల ముందు షో' అంటూ ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్తో రెండో టెస్టులోనూ పాకిస్థాన్కు ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్ (ENG vs PAK) పూర్తి ఆధిక్యంతో విజయం సాధించింది. ఈ పరాజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ చివరి స్థానానికి చేరుకుంది. ఈ రెండు జట్లకూ ఫైనల్కు చేరే అవకాశాలు లేవు. అయితే రెండో టెస్టు సందర్భంగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
వివరాలు
ఇంతకీ బ్రాడ్ ఎందుకు స్పందించాడు? అసలేం జరిగింది?
ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ ముందు 389 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. అయితే ఆ జట్టు 194 పరుగులకే కుప్పకూలి భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
పాకిస్థాన్ ప్రధాన బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ గాయం కారణంగా బ్యాటింగ్కు దిగలేదు. అయితే ఇమామ్ ఉల్ హక్ గాయంతో వార్మప్ చేస్తున్న దృశ్యాలు కెమెరాలో కనిపించాయి.
దీనిపై స్పందించిన స్టువర్ట్ బ్రాడ్.. పాక్ ఆటగాడిని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. "ఇదంతా డ్రామానే. కెమెరాల ముందు షో చేసేందుకే అన్నట్లుగా ఉంది.
మీడియా, తన సహచరుల నుంచి అటెన్షన్ కోసం వార్మప్ చేస్తూ గాయం వల్ల బాధపడుతున్నట్లు కనిపించాడని అనిపించింది.
వివరాలు
నటించినట్లు అనిపించింది: పాక్ మాజీ బ్యాటర్
ఇదంతా ఎవరూ చూడకుండా గదిలో చేస్తే ఫర్వాలేదు. అంతేకానీ, షార్ట్స్ వేసుకుని కాళ్లకు టేప్తో రావాల్సిన అవసరం లేదు.
నిజంగా గాయమైతే ఇక్కడ ఎవరూ అడ్డు చెప్పరు కదా..! నాకైతే ఇది అస్సలు నచ్చలేదని బ్రాడ్ వ్యాఖ్యానించాడు.
స్టువర్ట్ బ్రాడ్ మాత్రమే కాదు.. అంతకుముందు పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహ్మద్ వసీమ్ కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. బ్యాటింగ్ చేయకుండా తప్పించుకునేందుకు ఇమామ్ తన గాయాన్ని కాస్త అతిగా ప్రదర్శించినట్లు అనిపించిందని తెలిపాడు.
కెమెరాల ముందు బ్యాటింగ్ కోసం తాను కష్టపడుతున్నానని నటించినట్లుగా కనిపించిందని మహ్మద్ వసీమ్ పేర్కొన్నాడు.
వివరాలు
అత్యంత చెత్త బోర్డు ఇదే: రషీద్ లతీఫ్
మరోవైపు ఇమామ్ ఉల్ హక్ గాయంపై పాకిస్థాన్ మేనేజ్మెంట్ కూడా ప్రకటన చేసింది. "అతడికి ఎడమ కాలి కండరాలు పట్టేశాయి. అందుకే బరిలోకి దిగలేదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ జట్టుతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డుపైనా మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. గత 70 ఏళ్లలో అత్యంత చెత్త బోర్డు ఇదేనని వ్యాఖ్యానించాడు.
50 ఏళ్లలో అత్యంత చెత్త టీమ్ ఇదే. ఇక్కడ మనం బోర్డు గురించి కూడా చర్చించాలి.
ఎందుకంటే ఆటగాళ్లను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ, కోచ్లను నియమించేది బోర్డే కదా. జట్టు నాశనం కావడానికి ప్రధాన కారణం ఆ బోర్డేనని రషీద్ లతీఫ్ ఆరోపించాడు.