Nepal Flood Donation Scam: చాట్జీపీటీతో రూ.1.2 లక్షల నకిలీ విరాళం రసీదు.. సొంత QRతో డబ్బులు మళ్లింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగించి నకిలీ విరాళం రసీదు తయారు చేసి.. విపత్తు సహాయ నిధికి వెళ్లాల్సిన డబ్బులను తన ఖాతాలోకి మళ్లించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. రామ్చాప్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గోకుల్గంగా గ్రామీణ మున్సిపాలిటీకి చెందిన భగవాన్ కార్కి (32)ని జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కార్కి ChatGPTను ఉపయోగించి నకిలీ eSewa లావాదేవీ స్టేట్మెంట్ను రూపొందించినట్లు అధికారులు గుర్తించారు. అందులో నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధి (Prime Minister's Disaster Relief Fund)కు NPR 1,20,000 (సుమారు రూ. 1.2 లక్షలు) విరాళంగా చెల్లించినట్లు చూపించాడు.
వివరాలు
ఆ మొత్తం నగదు జమ కాలేదు
వాస్తవానికి ఆ మొత్తం నిధికి జమ కాలేదని పోలీసులు తెలిపారు.
నకిలీ డిజిటల్ రసీదులో విపత్తు సహాయ నిధి పేరును గ్రహీతగా చూపించడంతో పాటు.. అది నిజమైన లావాదేవీగా కనిపించేలా ట్రాన్సాక్షన్ వివరాలు, సీక్వెన్స్ను రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు.
అనంతరం కార్కి ఈ నకిలీ స్టేట్మెంట్ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.
ఇటీవల భోటేకోషి ప్రాంతంలో సంభవించిన తీవ్ర వరదల్లో బాధితులకు సహాయం చేస్తున్న ఉదార దాతగా తనను తాను చూపించుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే అక్కడితో ఆగకుండా.. నకిలీ విరాళం చెల్లింపు ఆధారంతో పాటు తన వ్యక్తిగత eSewa, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమైన QR కోడ్ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
వివరాలు
విరాళాల పేరుతో మోసాలు
విపత్తు బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు చెబుతూ.. ప్రజలు ఆ QR కోడ్ ద్వారా డబ్బులు పంపేలా కోరినట్లు పోలీసులు తెలిపారు.
రామ్చాప్ జిల్లా పోలీసు కార్యాలయ సమాచార అధికారి, పోలీస్ ఇన్స్పెక్టర్ కమల్ రౌత్ అరెస్టును ధ్రువీకరించారు.
మోసం, డిజిటల్ తప్పుడు సమాచారానికి సంబంధించిన చట్టాల కింద కార్కిపై తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
వివరాలు
విపత్తు సహాయ నిధులపైనా సైబర్ మోసాలు
నేపాల్లో విపత్తు సహాయ కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ ఆర్థిక మోసాలు పెరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మధ్య, ఉత్తర నేపాల్లో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. భారీగా మౌలిక వసతులు దెబ్బతిన్నాయి.
దీంతో బాధితులను ఆదుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు.
ఈ పరిస్థితిని సైబర్ మోసగాళ్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం, నేపాల్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.
AI ఆధారిత మోసాలు, అనధికారిక QR కోడ్ల ద్వారా విరాళాల మళ్లింపు వంటి ఘటనలు జరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వివరాలు
జాగ్రత్తగా ఉండాలి
విపత్తు సహాయ నిధికి విరాళాలు అందించే సమయంలో 'Prime Minister Disaster Relief Fund' పేరుతో అధికారికంగా నిర్దేశించిన పోర్టల్, బ్యాంకు ఖాతాల ద్వారా మాత్రమే డబ్బులు చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో కనిపించే వ్యక్తిగత QR కోడ్లు లేదా ధృవీకరణ లేని ఖాతాలకు విరాళాలు పంపకుండా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఈ ఘటనతో విపత్తు సమయంలో ప్రజల సానుభూతిని, AI సాంకేతికతను ఉపయోగించుకుని నకిలీ ఆధారాలతో డబ్బులు దారి మళ్లించే మోసాలపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.