Modi-Masoud Pezeshkian: మోదీతో పెజెష్కియన్ భేటీ.. ద్వైపాక్షిక సహకారంపై కీలక చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రాంతీయ శాంతి,స్థిరత్వం,పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రశంసించారు. మంగళవారం ప్రధాని మోదీతో జరిగిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగా ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈసందర్భంగా ఇటీవల భారత్ విజయవంతంగా నిర్వహించిన బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశాన్ని పెజెష్కియన్ అభినందించారు. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికలు భారత్-ఇరాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక అనుబంధాలను ప్రస్తావిస్తూ.. రాజకీయ,ఆర్థిక,వాణిజ్య,రవాణా రంగాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు విశాల అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
వివరాలు
పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై ఇరు దేశాధినేతల అభిప్రాయ మార్పిడి
ప్రాంతంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో కుదిరిన ఒప్పందాలను అమలు చేయడంలో ఇరాన్ పూర్తిగా కట్టుబడి ఉందని పెజెష్కియన్ మరోసారి స్పష్టం చేశారు. శాశ్వత శాంతి, భద్రతల సాధన కోసం ఇతర పక్షాలు కూడా బాధ్యతాయుతంగా ఒప్పంద నిబంధనలను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. దురాక్రమణ చర్యలను అడ్డుకోవడంలో అంతర్జాతీయ సమాజం చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
భారత్-ఇరాన్ మధ్య ఉన్నతస్థాయి చర్చలు
అంతర్జాతీయ అంశాలపై అనేక సందర్భాల్లో భారత్, ఇరాన్ ఒకే విధమైన అభిప్రాయాలను పంచుకోవడం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణతో పాటు స్వేచ్ఛాయుత నౌకాయానానికి దోహదపడే ఒప్పందాలను ప్రధాని మోదీ గతంలోనూ స్వాగతించిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉన్నతస్థాయి చర్చలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.