Ali Khameneis: ఖమేనీ అంత్యక్రియల్లో కనిపించిన ముసుగు వ్యక్తి ఎవరు? సోషల్ మీడియాలో ఊహాగానాలు..!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ముసుగు ధరించిన ఓ వ్యక్తి కనిపించడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. బేస్బాల్ క్యాప్తో పాటు నల్లరంగు ఫేస్ మాస్క్ ధరించి వచ్చిన ఆ వ్యక్తి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అంత్యక్రియల సమయంలో ఖమేనీ కుటుంబానికి చెందిన చిన్నారి మృతదేహాన్ని ఉంచిన శవపేటికను మోసిన వారిలో కూడా అతడు ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఆ ముసుగు వ్యక్తి ఎవరు అనే అంశంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు అతడు అలీ ఖమేనీ కుమారుడు, ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
తండ్రి అంత్యక్రియలకు రహస్యంగా హాజరు..
భద్రతా కారణాల దృష్ట్యా తన తండ్రి అంత్యక్రియలకు రహస్యంగా హాజరయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇరాన్ ఇంటర్నేషనల్ పత్రిక మాత్రం మరో వాదనను వినిపించింది. ఆ వ్యక్తి అలీ ఖమేనీ పెద్ద మనవడు మహమ్మద్ జావెద్ ఖమేనీ అని పేర్కొంది. ఫిబ్రవరి 28న అమెరికా ఖమేనీ కాంపౌండ్పై నిర్వహించిన దాడిలో జావెద్ తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యాడని ఆ కథనం వెల్లడించింది. అదే దాడిలో ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. జావెద్, అలీ ఖమేనీ పెద్ద కుమారుడు ముస్తఫా ఖమేనీ కుమారుడు అని పేర్కొంది. అయితే ఈ ఊహాగానాలపై లేదా ఆ వ్యక్తి గుర్తింపుపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.