Nepal: నేపాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ఎందుకు వస్తున్నాయి? అసలు కారణం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్ను మరోసారి మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి. అయితే ఇది కేవలం వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పుల వల్ల జరిగిన విధ్వంసంగా చూడలేం. నేపాల్ విపత్తులకు అత్యంత సున్నితమైన దేశంగా మారడానికి రెండు కీలక దృగ్విషయాలు కలిసి పనిచేస్తున్నాయి. ఒకవైపు వాతావరణ మార్పులతో హిమాలయాలు వేడెక్కుతూ.. అస్థిర ప్రాంతాల్లో భారీగా నీరు నిల్వ అవుతోంది. మరోవైపు భారత, యూరేసియా భూ ఫలకాలు పరస్పరం ఢీకొంటుండటంతో హిమాలయాల నిర్మాణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
వివరాలు
హిందుకుష్లో వేగంగా కరుగుతున్న మంచు
బుధవారం నేపాల్లో సంభవించిన మెరుపు వరదలను భూభాగంలో ఏర్పడే సునామీతో పోల్చవచ్చు.
ఇలాంటి 'ఇన్ల్యాండ్ సునామీ' తరహా విపత్తుల ముప్పు నేపాల్కు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గతంలోనే హెచ్చరించారు.
2000సంవత్సరం నుంచి హిమాలయాల్లోని హిందుకుష్ ప్రాంత హిమానీనదాల్లో మంచు కరిగే వేగం దాదాపు రెట్టింపైంది.
ఇలా కరిగిన మంచు నీరు పర్వత ప్రాంతాల్లోని అస్థిర ప్రదేశాల్లో చేరి హిమనదీయ సరస్సులుగా మారుతోంది.
ఈ సరస్సులు పర్వతాలపై ఏర్పాటు చేసిన నీటి బాంబుల్లా మారుతున్నాయి.
ఏదైనా కారణంతో వాటి సహజ కట్టలు తెగిపోతే.. ఒక్కసారిగా భారీగా నీరు దిగువ ప్రాంతాలకు దూసుకొస్తుంది.
దీంతో క్షణాల్లోనే మెరుపు వరదలు సంభవిస్తాయి. హిమానీనదాలు,హిమనదీయ సరస్సులు ఉప్పొంగడం వల్ల నేపాల్,టిబెట్ ప్రాంతాల్లో గతంలోనూ పలుమార్లు భారీ వరదలు సంభవించాయి.
వివరాలు
3,624 హిమనదీయ సరస్సులు
ఈ ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
కోశీ, గండకీ, కర్నాలీ నదీ పరీవాహక ప్రాంతాల్లో మొత్తం 3,624 హిమనదీయ సరస్సులు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) 2020లో వెల్లడించింది.
వీటిలో 47 సరస్సులను అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించింది. వాటిలో 25 టిబెట్లో, 21 నేపాల్లో, మరో సరస్సు భారత్లో ఉన్నట్లు పేర్కొంది.
హిమనదీయ సరస్సులు ఒక్కసారిగా ఉప్పొంగడం, హిమపాతాలు సంభవించడం వంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేసే సాంకేతిక వ్యవస్థలు నేపాల్లో తగినంతగా అందుబాటులో లేవు.
దీంతో ప్రమాదం సంభవించేలోపే ప్రజలను అప్రమత్తం చేయడం కష్టమవుతోంది. ఈ సాంకేతిక లోపం కూడా నేపాల్ విపత్తు ముప్పును మరింత పెంచుతోంది.
వివరాలు
పెరుగుతున్న హిమాలయాల ఎత్తు
నేపాల్ను వెంటాడుతున్న మరో పెద్ద సమస్య హిమాలయాల నిర్మాణ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటమే.
భారత, యూరేసియా టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో నేపాల్ ఉంది.
ఈ రెండు భూ ఫలకాలు ఏటా దాదాపు 20 నుంచి 21 మిల్లీమీటర్ల మేర ఒకదానికొకటి దగ్గరవుతున్నాయి.
సుమారు 5 కోట్ల సంవత్సరాల క్రితం భారత, యూరేసియా భూ ఫలకాలు ఢీకొనడంతో హిమాలయాల ఏర్పాటుకు పునాది పడింది.
ఆ భౌగోళిక ప్రక్రియ పూర్తిగా ఆగిపోలేదు. ఇప్పటికీ నెమ్మదిగా కొనసాగుతోంది.
ఫలితంగా హిమాలయాల ఎత్తు ప్రతి ఏడాది సుమారు 5 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న పర్వత శ్రేణిగా హిమాలయాలను శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు.
వివరాలు
భూకంపాలతో పెరుగుతున్న వరద ప్రమాదం
భూ ఫలకాల నిరంతర కదలికల వల్ల హిమాలయ ప్రాంతంలో విపరీతమైన భౌగోళిక ఒత్తిడి ఏర్పడుతోంది.
ఈ ఒత్తిడి తరచూ భూకంపాలకు దారితీస్తోంది. భూకంపాలు సంభవించినప్పుడు పర్వత ప్రాంతాల్లోని హిమనదీయ సరస్సులు అస్థిరంగా మారే అవకాశం పెరుగుతుంది.
వాటి సహజ కట్టలు తెగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
అప్పుడు పెద్ద మొత్తంలో నీరు దిగువ ప్రాంతాల వైపు ఒక్కసారిగా దూసుకొచ్చి భారీ వరదలకు కారణమవుతుంది.
అంటే.. హిమాలయాల్లో మంచు కరగడం, హిమనదీయ సరస్సులు పెరగడం, భూ ఫలకాల కదలికలు, భూకంపాలు.. ఇవన్నీ కలిసి నేపాల్లో విపత్తు ముప్పును మరింత తీవ్రం చేస్తున్నాయి.
బుధవారం సంభవించిన వరద విలయం కూడా టిబెట్లో చోటుచేసుకున్న భూకంపం కారణంగా ఓ హిమనదీయ సరస్సు ఉప్పొంగడంతోనే సంభవించినట్లు తెలుస్తోంది.