Russian-Ukraine: ఉక్రెయిన్పై రష్యా దాడులు.. 1.2 కోట్ల పుస్తకాలు ధ్వంసం
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రష్యా దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కీవ్ శివార్లలోని ఓ ముద్రణ కేంద్రంపై రాత్రివేళ రష్యా క్షిపణి దాడి చేయడంతో భారీగా పుస్తకాలు కాలిపోయాయి. విద్యా సంవత్సరం కోసం పాఠ్యపుస్తకాలను ముద్రించే పనిలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. ముద్రణ కేంద్రంలో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. మంటల్లో కాలిపోయిన పుస్తకాల శిథిలాల మధ్య ఇంగ్లిష్ పాఠ్యపుస్తకంలోని ఓ పేజీ కనిపించింది. అందులో 'నా పేరు విలియం. నేను బ్రిటన్ నుంచి వచ్చాను. నా అమ్మమ్మ నాటింగ్హామ్లో నివసిస్తుంది. అదొక అందమైన నగరం' అని ఉంది. అయితే మిగిలిన పుస్తకాలు పూర్తిగా దెబ్బతినడంతో వాటిని కాపాడే అవకాశం లేకుండా పోయింది.
వివరాలు
పుస్తక ముద్రణ కేంద్రాలే లక్ష్యంగా..
కీవ్లోని ఈ ముద్రణ కేంద్రం కొత్త విద్యా సంవత్సరం కోసం సుమారు 13 లక్షల పుస్తకాలను ముద్రించి సరఫరా చేయాల్సి ఉంది.
ఇది ఉక్రెయిన్లో ముద్రించే మొత్తం పాఠ్యపుస్తకాల్లో దాదాపు 10 శాతానికి సమానం. రష్యా దాడితో ఆ పుస్తకాలన్నీ బూడిదయ్యాయి.
ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ అంతటా పలు ముద్రణ కేంద్రాలు, ప్రచురణ సంస్థలపై రష్యా దాడులు జరిగాయి.
ఈ దాడుల్లో మొత్తం 1.2 కోట్ల పుస్తకాలు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఈ ఏడాది ఉక్రెయిన్లో ముద్రించిన పుస్తకాల్లో దాదాపు మూడో వంతు రష్యా దాడుల్లో నాశనమైనట్లు తెలిపింది.
వివరాలు
పుస్తక ముద్రణ కేంద్రాలే లక్ష్యంగా..
కీవ్లోని ముద్రణ సంస్థకు చెందిన కమర్షియల్ డైరెక్టర్ విక్టోరియా హైదాయ్ మాట్లాడుతూ.. ఈ దాడులు ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయని ఆరోపించారు.
గత రెండు నెలల్లోనే పలు ప్రముఖ ప్రచురణ సంస్థలకు చెందిన పుస్తకాల నిల్వ, రవాణా కేంద్రాలు దెబ్బతిన్నాయని చెప్పారు.
పెద్ద మొత్తంలో పుస్తకాలను నిల్వ ఉంచే గిడ్డంగులు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు.
'ఉక్రెయిన్ను ఓ దేశంగా చెరిపేయాలనే ఉద్దేశంతోనే రష్యా ముద్రణ కేంద్రాలను ధ్వంసం చేస్తోంది.
అయితే వారు తమ లక్ష్యాన్ని సాధించలేరు' అని హైదాయ్ పేర్కొన్నారు. ఇటీవలి వారాల్లో 35కి పైగా ప్రచురణ, ముద్రణ కేంద్రాలు దాడులకు గురైనట్లు సమాచారం.
వివరాలు
పాత పుస్తకాల మార్కెట్పైనా దాడి
కొత్తగా ముద్రిస్తున్న పుస్తకాలతో పాటు పాత పుస్తకాల మార్కెట్లు కూడా రష్యా దాడుల బారినపడ్డాయి.
కీవ్లోని పోచైనా సెకండ్హ్యాండ్ పుస్తకాల మార్కెట్పై జరిగిన దాడిలో వందలాది దుకాణాలు, ఎంతో విలువైన పుస్తకాలు ధ్వంసమయ్యాయి.
మంటలను ఆర్పే పని పూర్తికాకముందే 28 ఏళ్ల పుస్తక బ్లాగర్ లిలియా వెలికా అక్కడికి చేరుకున్నారు.
కాలిపోయిన శిథిలాల్లో ఏమైనా పుస్తకాలు కాపాడగలమా అని వెతికారు. ఆమెకు తడిసిపోయిన ఓ సైన్స్ ఫిక్షన్ నవల లభించింది.
'పుస్తకాలు మమ్మల్ని కాపాడుతున్నాయి. వాటిని కోల్పోవడం అంటే మా హృదయాలను కోల్పోయినట్టే' అని లిలియా ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
సాంస్కృతిక వారసత్వానికీ దెబ్బ
మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, సినిమా స్టూడియోలు, గ్రంథాలయాలు, ఒపెరా హౌస్లు కూడా రష్యా దాడుల్లో దెబ్బతిన్నాయి.
కీవ్-పెచెర్స్క్ లావ్రా ప్రాంతంలోని ప్రసిద్ధ పురాతన మఠం కూడా దాడుల ప్రభావానికి గురైంది.
అక్కడి డార్మిషన్ కేథడ్రల్ బంగారు గోపురాలు దెబ్బతిన్నాయి. మతపరమైన విలువైన వస్తువులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అయితే డ్రోన్ దాడి తర్వాత భవనంలోని పైకప్పులోని కొంత భాగానికి మంటలు అంటుకున్నాయి.
మరమ్మతులకు సుమారు 11.2 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. పనులు పూర్తయ్యేందుకు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది.
వివరాలు
ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు
ఈ ప్రాంతంలో ఉక్రెయిన్కు చెందిన పుస్తకాలు, ముద్రణకు సంబంధించిన మ్యూజియం కూడా ఉంది.
యునెస్కో 1990లో ఈ సముదాయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
2023 సెప్టెంబరులో ప్రమాదంలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోనూ చేర్చింది.
మఠం స్థాపించి 975 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల జరిగిన కార్యక్రమంలో యునెస్కో డైరెక్టర్ జనరల్ ఖలేద్ ఎల్-ఎనానీ ఈ నష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ చట్టాల ప్రకారం రక్షణ పొందుతున్న సాంస్కృతిక ఆస్తులపై జరుగుతున్న అన్ని దాడులను యునెస్కో తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
వివరాలు
'ఉక్రెయిన్ ఉనికిని చెరిపేయాలనేదే రష్యా లక్ష్యం'
ఉక్రెయిన్ సాంస్కృతిక శాఖ మంత్రి టెత్యానా బెరెజ్నా మాట్లాడుతూ.. యుద్ధం వల్ల కలిగే సైనిక, సాంస్కృతిక నష్టాలను విడివిడిగా చూడకూడదన్నారు.
రష్యా ఉక్రెయిన్ను ఓ దేశంగా,జాతిగా చెరిపేయాలని చూస్తోందని ఆరోపించారు.
'మా గుర్తింపును,సంస్కృతిని కాపాడుకోవడం మాకు ఎంతో ముఖ్యం. అందుకే మా సాంస్కృతిక వారసత్వంపై దాడులు జరుగుతున్నాయి. మేము తరతరాలుగా కాపాడుకుంటున్న దేనినైనా రష్యా ధ్వంసం చేయాలని చూస్తోంది'అని ఆమె పేర్కొన్నారు.
ఉక్రెయిన్ వారసత్వానికి చెందిన 1,900కు పైగా ప్రదేశాలు,వస్తువులు, 2,000కు పైగా సాంస్కృతిక సంస్థలపై రష్యా దాడులు చేసిందని బెరెజ్నా తెలిపారు.
కళలు, సాహిత్యాన్ని డిజిటల్ రూపంలో భద్రపరచడం ద్వారా వాటిని రక్షించే ప్రయత్నం జరుగుతోందన్నారు.
భౌతిక పుస్తకాలు ధ్వంసమైనా పిల్లలు తమ చరిత్ర, సాహిత్యాన్ని నేర్చుకునేలా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.
వివరాలు
అంతర్జాతీయ సహాయం అవసరం
ఉక్రెయిన్ మొత్తం ప్రచురణ రంగమే ఇప్పుడు ముప్పులో ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రంగం కొనసాగేందుకు అంతర్జాతీయ సహాయం అవసరమని చెబుతున్నారు.
కీవ్లో ధ్వంసమైన ముద్రణ కేంద్రంలో విక్టోరియా హైదాయ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ సాహిత్యాన్ని కాపాడాలంటే ముద్రణ రంగాన్ని రక్షించడం చాలా ముఖ్యమన్నారు.
'పదమే అన్నీ. అదే మా అభివృద్ధి, మా సంస్కృతి, మా చారిత్రక వారసత్వం. అది ఒక తరం నుంచి మరో తరానికి అందుతుంది' అని చెప్పారు.
వివరాలు
పుతిన్ గత వ్యాఖ్యలపై చర్చ
2021లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాసిన 'రష్యన్లు, ఉక్రెయిన్ ప్రజల చారిత్రక ఐక్యత' అనే వ్యాసంలో ఇరు దేశాల ప్రజలు ఒకే జాతికి చెందినవారంటూ పేర్కొన్నారు.
స్వతంత్ర ఉక్రెయిన్ దేశం,దాని సంస్కృతి చట్టబద్ధతపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
అయితే ఉక్రెయిన్లో సాంస్కృతిక వారసత్వానికి జరిగిన నష్టానికి ఆ దేశ ప్రభుత్వమే కారణమని బ్రిటన్లోని రష్యా రాయబార కార్యాలయం బీబీసీకి ఇచ్చిన ప్రకటనలో ఆరోపించింది.
వివరాలు
పుతిన్ గత వ్యాఖ్యలపై చర్చ
స్మారక చిహ్నాలను తొలగించడం, వీధుల పేర్లు మార్చడం వంటి చర్యలు జరిగాయని పేర్కొంది.
సాంస్కృతిక ప్రదేశాలను సైనిక స్థావరాలను దాచేందుకు ఉపయోగించారని కూడా ఆరోపించింది.
ఉక్రెయిన్పై పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభించిన ఐదేళ్ల కాలంలో పౌర ప్రాంతాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను క్రెమ్లిన్ పదేపదే ఖండించింది.
అయితే నివాస భవనాలు, ఇతర పౌర మౌలిక వసతులపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో పదేపదే దాడులు జరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.