Loading...
Thailand: 5 వేల మంది అమెరికా నావికులతో థాయ్‌లాండ్‌కు యుద్ధనౌక.. పటాయాలో భద్రత కట్టుదిట్టం
పటాయాలో భద్రత కట్టుదిట్టం

Thailand: 5 వేల మంది అమెరికా నావికులతో థాయ్‌లాండ్‌కు యుద్ధనౌక.. పటాయాలో భద్రత కట్టుదిట్టం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా నౌకాదళానికి చెందిన భారీ యుద్ధనౌక USS అబ్రహం లింకన్ ఈ వారం థాయిలాండ్‌కు చేరుకోనుంది. దీంతో ప్రముఖ పర్యాటక నగరం పటాయాలో వ్యాపారాలకు కొంత ఊపు వచ్చే అవకాశం ఉంది. అయితే వేలాది మంది అమెరికా నావికులు నగరానికి రానున్న నేపథ్యంలో అక్కడి అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా వ్యభిచారం,ప్రజా క్రమశిక్షణకు సంబంధించిన అంశాలపై తనిఖీలు ముమ్మరం చేశారు. సెప్టెంబర్ 2న పటాయా సమీపంలోని లేమ్‌చబాంగ్ పోర్టుకు USS అబ్రహం లింకన్ చేరుకోనుంది. సెప్టెంబర్ 6 వరకు థాయ్‌లాండ్‌లోనే ఉండనుంది. ఈ యుద్ధనౌకతో పాటు మరో రెండు నౌకలు కూడా రానున్నాయి.

వివరాలు 

పటాయాలో పోలీసుల తనిఖీలు ముమ్మరం

సముద్రంలో 200 రోజులకు పైగా గడిపిన సుమారు 5 వేల మంది నావికులు, మెరైన్లు కొంత విశ్రాంతి తీసుకునేందుకు ఈ పర్యటన అవకాశం కల్పించనుంది.

పర్యాటక రంగం మందకొడిగా ఉన్న సమయంలో అమెరికా సిబ్బంది రాక పటాయా వ్యాపారులకు ఆశలు కలిగిస్తోంది.

పెద్ద సంఖ్యలో అమెరికా సైనికులు నగరంలో ఖర్చు చేయడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద వ్యాపారాలకు ఆదాయం పెరుగుతుందని స్థానిక వ్యాపారులు భావిస్తున్నారు.

అయితే నగరంలోని నైట్‌లైఫ్, సెక్స్‌ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా నావికులు ఎక్కువగా వెళ్లే అవకాశం ఉన్న ప్రాంతాల్లో థాయ్ అధికారులు గస్తీని పెంచారు.

పటాయా బీచ్, సెకండ్‌ రోడ్‌తో పాటు ప్రధాన నైట్‌లైఫ్ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

వివరాలు 

పటాయాలో పోలీసుల తనిఖీలు ముమ్మరం

ఆగస్టు 29 రాత్రి జరిగిన తనిఖీల్లో పటాయా సిటీ పోలీసులు, టూరిస్ట్ పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు, సామాజిక అభివృద్ధి విభాగాలకు చెందిన 20 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు.

ఈ తనిఖీల్లో బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారానికి పాల్పడుతున్నారనే అనుమానంతో 25 మందిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

వారిలో 18 మంది థాయ్ పౌరులు, ఐదుగురు లావోస్‌ దేశస్థులు, ఇద్దరు ఉగాండా దేశస్థులు ఉన్నారు.

వారిని తదుపరి న్యాయ ప్రక్రియ కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. తనిఖీలు, గస్తీ కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

పిల్లలు,యువత భద్రత,బహిరంగ ప్రదేశాల్లో అడుక్కోవడం,ఇతర ప్రజా క్రమశిక్షణ అంశాలపైనా అధికారులు దృష్టి పెట్టనున్నారు.

థాయిలాండ్‌లో వ్యభిచారం చట్టవిరుద్ధమైనప్పటికీ పటాయా,బ్యాంకాక్‌లోని కొన్ని ప్రాంతాల్లో సెక్స్‌ ఇండస్ట్రీ బహిరంగంగానే కనిపిస్తుంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

పర్యాటక రంగానికి ఊపు వస్తుందని ఆశలు

వేలాది మంది అమెరికా సైనికుల రాకతో పర్యాటకంపై ఆధారపడిన వ్యాపారాల్లో ఆశలు పెరిగాయి.

ఒక్కో అమెరికా సైనికుడు పటాయాలో ఎంతసేపు ఉంటారు, రాత్రి అక్కడే బస చేస్తారా అనే అంశాలపై ఆధారపడి రోజుకు 1,000 నుంచి 3,000 థాయ్‌ బాత్‌లు (సుమారు 30 నుంచి 91 డాలర్లు) వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని పటాయా మేయర్ పొరమాసే న్గాంపిచెస్ తెలిపారు.

అయితే మొత్తం 5 వేల మంది ఒకేసారి నగరంలోకి వచ్చే అవకాశం లేదు. వారి షోర్ లీవ్‌ను వేర్వేరు సమయాల్లో ఇవ్వనున్నారు.

అయినప్పటికీ ఈ పర్యటనను స్థానిక పర్యాటక వ్యాపారులు మంచి అవకాశంగా చూస్తున్నారు. ఈ ఏడాది వ్యాపారం చాలా మందకొడిగా సాగిందని వారు చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

పటాయాతో అమెరికా సైన్యానికి పాత అనుబంధం

అమెరికా సైన్యానికి పటాయాతో చాలా కాలంగా అనుబంధం ఉంది.

ఒకప్పుడు మత్స్యకారుల గ్రామంగా ఉన్న పటాయా ప్రధాన పర్యాటక కేంద్రంగా ఎదగడంలో వియత్నాం యుద్ధ సమయంలో అక్కడికి వచ్చిన అమెరికా సైనికుల పాత్ర కూడా ఉంది.

అప్పటి నుంచి నగరంలో పర్యాటక రంగం క్రమంగా విస్తరించింది.

వివరాలు 

సెక్స్‌ టూరిజంపై ఆందోళనలు

అమెరికా సైనికుల రాకతో సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో పటాయా నైట్‌లైఫ్‌ పరిశ్రమకు సంబంధించిన మరో అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

లైంగిక దోపిడీ, ఆరోగ్య భద్రతకు సంబంధించిన సమస్యలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఒక్కసారిగా కస్టమర్ల సంఖ్య పెరగడం వల్ల లైంగిక దోపిడీ, లైంగికంగా సంక్రమించే వ్యాధుల ప్రమాదం వంటి సమస్యలు తలెత్తవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

USS అబ్రహం లింకన్‌లో ఉన్న సిబ్బందిలో ఒత్తిడి, ఆత్మహత్యాయత్నాలకు సంబంధించిన నివేదికలు కూడా గతంలో వెలువడ్డాయి.

దీంతో ఈ పర్యటన సమయంలో సిబ్బంది సంక్షేమానికి సంబంధించిన అంశం కూడా అధికారులకు మరో ఆందోళనగా మారింది.

వివరాలు 

సెక్స్‌ టూరిజంపై ఆందోళనలు

అబ్రహం లింకన్‌ యుద్ధనౌక ప్రస్తుత మోహరింపు సాధారణం కంటే ఎక్కువ కాలం కొనసాగింది.

గత నవంబర్‌లో శాన్‌ డియాగో నుంచి బయలుదేరిన ఈ నౌకను అనంతరం ఇరాన్‌తో జరిగిన యుద్ధ సమయంలో అమెరికా సైనిక చర్యలకు మద్దతుగా పశ్చిమ ఆసియాకు తరలించారు.

ఇప్పటివరకు వరుసగా 200 రోజులకు పైగా సముద్రంలోనే ఉంది. పటాయాలో 3 లక్షలకు పైగా హోటల్ గదులు ఉన్నాయి.

దీంతో పెద్ద సంఖ్యలో సందర్శకులకు వసతి కల్పించే సామర్థ్యం నగరానికి ఉంది.

అమెరికా యుద్ధనౌక రాకకు ముందు భద్రత, ట్రాఫిక్, పర్యాటక ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు థాయ్ అధికారులు చర్యలు చేపట్టారు.

ADVERTISEMENT