US-Iran Peace Talks : అమెరికా-ఇరాన్ దోహా చర్చల్లో పురోగతి.. 6 బిలియన్ డాలర్ల నిధుల విడుదలకు అంగీకారం
ఈ వార్తాకథనం ఏంటి
ఖతార్ రాజధాని దోహాలో అమెరికా, ఇరాన్ మధ్య రెండు రోజుల పాటు సాగిన పరోక్ష సాంకేతిక చర్చలు బుధవారం ముగిశాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) అమలుపై ఇరు దేశాలు పురోగతి సాధించినట్లు వెల్లడించాయి. అయితే దీర్ఘకాలిక శాంతి ఒప్పందం లేదా ఇరాన్ అణు కార్యక్రమంపై ఎలాంటి కీలక పురోగతి సాధించలేదని స్పష్టం చేశాయి. ఈ చర్చల్లో ప్రధానంగా హర్ముజ్ జలసంధి ద్వారా సముద్ర రవాణాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడం, విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధుల విడుదల వంటి అంశాలపై దృష్టి సారించారు. ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంలోని అంశాల అమలుపై ఇరు దేశాల ప్రతినిధులు చర్చించారు.
వివరాలు
ఈ అంశాలపై ఇంకా విభేదాలు
ఇరాన్ తరఫున చర్చలకు నాయకత్వం వహించిన ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది మాట్లాడుతూ, ఒప్పంద ఉల్లంఘనలపై సమాచారం పంచుకునేందుకు ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధుల్లో కొంత భాగాన్ని విడుదల చేసి, దేశీయ అవసరాలకు అనుగుణంగా వస్తువుల కొనుగోలుకు అనుమతించనున్నట్లు వెల్లడించారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల సడలింపు, ప్రాంతీయ భద్రత వంటి ప్రధాన అంశాలపై ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. ఈ అంశాలపై ఎలాంటి రాజకీయ ఒప్పందం కుదరలేదని వెల్లడించాయి.
వివరాలు
అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు పూర్తైన తర్వాత తదుపరి విడత చర్చలు
ఖతార్ విదేశాంగ శాఖ మాత్రం ఈ చర్చల్లో సానుకూల పురోగతి నమోదైందని పేర్కొంది. ఇటీవల స్విట్జర్లాండ్లో జరిగిన శిఖరాగ్ర సమావేశం ఫలితాల ఆధారంగా ఈ చర్చలు ముందుకు సాగాయని తెలిపింది. ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు పూర్తైన తర్వాత తదుపరి విడత చర్చలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ చర్చలు నేరుగా కాకుండా మధ్యవర్తుల ద్వారా జరిగాయి. అమెరికా,ఇరాన్ ప్రతినిధులు వేర్వేరు గదుల్లో సమావేశమవగా,ఖతార్,పాకిస్థాన్ మధ్యవర్తులుగా వ్యవహరించాయి. అమెరికా ప్రతినిధులతో ప్రత్యక్ష సమావేశాలు జరగలేదని ఘరీబాబాది తెలిపారు. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ, సాంకేతిక చర్చల్లో పాల్గొనలేదు.
వివరాలు
ఈ చర్చల్లో ప్రధాన అంశంగా హర్ముజ్ జలసంధి
అయితే చర్చలకు ముందు ఖతార్ ఉన్నతాధికారులతో సమావేశమై దౌత్య ప్రక్రియకు సహకరించారు. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ఈ చర్చల్లో ప్రధాన అంశంగా నిలిచింది. ప్రపంచ చమురు, ద్రవీభవించిన సహజవాయువు (ఎల్ఎన్జీ) రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. ఇటీవల జరిగిన ఘర్షణల తర్వాత వాణిజ్య నౌకల రాకపోకలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, పరిస్థితిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఆగస్టు మధ్య వరకు టోల్ లేకుండా నౌకలు ప్రయాణించేందుకు అనుమతి ఉంది. ఆ తర్వాత వాణిజ్య నౌకలపై రుసుము వసూలు చేయాలని ఇరాన్ యోచిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
ఇసుకలో చిక్కుకున్న విదేశీ కంటైనర్ నౌక
ఇదే సమయంలో నిర్దేశిత మార్గం వెలుపల ప్రయాణించిన ఓ విదేశీ కంటైనర్ నౌక ఇసుకలో చిక్కుకుపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, అయితే భవిష్యత్తు పరిణామాలు ఇరాన్ వైఖరిపై ఆధారపడి ఉంటాయని అన్నారు. ప్రస్తుతం హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతపైనే చర్చలు జరుగుతున్నాయని, ఇరాన్ అణు కార్యక్రమంపై తర్వాతి దశలో చర్చిస్తామని చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దౌత్య ప్రయత్నాలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ అణు నిరాయుధీకరణ ప్రక్రియ సానుకూలంగా ముందుకు సాగుతోందని, సమావేశాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని వ్యాఖ్యానించారు. మరోసారి సైనిక ఘర్షణ జరిగే అవకాశంపై స్పందిస్తూ పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందన్నారు.
వివరాలు
పెండింగ్లోనే ఈ అంశాలు
గత నెల అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఘర్షణల అనంతరం 14 అంశాలతో కూడిన తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం 60 రోజుల్లో సమగ్ర శాంతి ఒప్పందంపై చర్చలు జరపాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఖమేనీ అంత్యక్రియల అనంతరం జరగనున్న తదుపరి విడత పరోక్ష చర్చల్లో ఈ అంశాలపై మరింత పురోగతి సాధించాలని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి. అమెరికా మరో సైనిక ఘర్షణను నివారించి ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం తీసుకురావాలని భావిస్తుండగా, ఇరాన్ మాత్రం నిలిచిపోయిన నిధులను తిరిగి పొందడం, హర్ముజ్ జలసంధిలో స్థిరత్వాన్ని కొనసాగించడం తమ ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుంది.