Loading...
'Economic Outcast': ఇరాన్‌తో చమురు వ్యాపారం.. భారత్‌కు చెందిన 4 సంస్థలపై అమెరికా ఆంక్షలు
ఇరాన్‌తో చమురు వ్యాపారం.. భారత్‌కు చెందిన 4 సంస్థలపై అమెరికా ఆంక్షలు

'Economic Outcast': ఇరాన్‌తో చమురు వ్యాపారం.. భారత్‌కు చెందిన 4 సంస్థలపై అమెరికా ఆంక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2026
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ నుంచి చమురు, పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల వాణిజ్యంలో భాగస్వామ్యమయ్యారన్న ఆరోపణలతో భారత్‌కు చెందిన నాలుగు సంస్థలు, ముగ్గురు వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్‌కు ఆర్థికంగా వచ్చే ఆదాయాన్ని అడ్డుకునే ఉద్దేశంతో అమెరికా చేపట్టిన 'ఆపరేషన్‌ ఎకనామిక్‌ ఔట్‌కాస్ట్‌'లో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. నాలుగు భారతీయ సంస్థలపై ఆంక్షలు పోర్టీజ్‌ పార్ట్‌నర్స్‌ ఎల్‌ఎల్‌పీ, సదాశివ ఓవర్సీస్‌ లిమిటెడ్‌, పీపీ సాఫ్ట్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ప్రకృతీస్‌ ఇన్‌ఫ్రా ఇంపెక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లపై ఆంక్షలు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఇరాన్‌ నుంచి పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు పోర్టీజ్‌ పార్ట్‌నర్స్‌ సహకరించిందని అమెరికా ఆరోపించింది.

వివరాలు 

ముగ్గురు భారతీయులపైనా చర్యలు

అలాగే సదాశివ ఓవర్సీస్‌ సుమారు 69 మిలియన్‌ డాలర్ల విలువైన ఇరాన్‌ పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు పేర్కొంది.

పోర్టీజ్‌ పార్ట్‌నర్స్‌ భాగస్వాములు హరీశ్‌ రామచంద్ర రంగి, ఇంద్రిస్మియా అష్రఫ్మియా షేక్‌, పీపీ సాఫ్ట్‌టెక్‌కు చెందిన ప్రశాంత్‌ గార్గ్‌పైనా అమెరికా ఆంక్షలు విధించింది.

ఇరాన్‌ పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల కొనుగోలు, రవాణా, విక్రయాలు లేదా మార్కెటింగ్‌కు సంబంధించిన భారీ స్థాయి లావాదేవీల్లో వీరు పాల్గొన్నారని అమెరికా ఆరోపించింది.

పీపీ సాఫ్ట్‌టెక్‌, ప్రకృతీస్‌ ఇన్‌ఫ్రా ఇంపెక్స్‌ ఇండియా ఒక్కొక్కటి దాదాపు 25 మిలియన్‌ డాలర్ల విలువైన ఇరాన్‌ పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు అమెరికా వెల్లడించింది.

వివరాలు 

ఒకేసారి 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై..

అమెరికా ట్రెజరీ శాఖ సోమవారం ఒకేసారి 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై ఆంక్షలు విధించింది.

ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే చర్యల్లో భాగంగా.. ఆ దేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలపైనా చర్యలు తీసుకుంటామని వాషింగ్టన్‌ హెచ్చరించింది.

అయితే, వెంటనే శిక్షలు విధించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

మధ్యప్రాచ్యంలో దౌత్య కార్యకలాపాలు మళ్లీ..

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో ఖాళీ చేసిన కొన్ని మధ్యప్రాచ్య దౌత్య కార్యాలయాలకు అమెరికా సిబ్బందిని తిరిగి పంపిస్తోంది.

కొన్ని కార్యాలయాలు ప్రారంభంలో పరిమిత సిబ్బందితోనే కార్యకలాపాలు నిర్వహించనున్నాయి.

ఈ పరిణామం ఇరాన్‌తో ఉద్రిక్తతలు సమీప కాలంలో మరింత తీవ్రం అయ్యే అవకాశం తగ్గుతోందన్న అంచనాలకు సంకేతంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT