ఇండియన్ ఆటో మార్కెట్లోకి ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఇండియన్ ఆటోమోబైల్ మార్కెట్లోకి ఏథెర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది. ఏథెర్ ఎనర్జీ సంస్థ ఈ స్కూటర్ను విడుదల చేసింది. ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్కు ఏథెర్ 450 ఎస్ పోటీనివ్వనుంది. 125cc వాహనాన్ని పోలిన రైడింగ్ అనుభవాన్ని 450ఎస్ స్కూటర్ ఇస్తుందని ఏథెర్ ఎనర్జీ ప్రకటించింది. జూలైలో బుకింగ్స్ ప్రారంభిమచనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఏథెర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 కిలో వాట్ పర్ హవర్ (kWh) బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ గా చార్జ్ చేస్తే 115 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఇది గంటకు 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో దూసుకెళ్లనుందని ఏథెర్ ఎనర్జీ తెలిపింది.
రూ.లక్ష ముప్పై వేలకు చేరువలో 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్
అధునాతన ఫీచర్లను ఈ స్కూటర్ కలిగి ఉంటుందని, త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. రూ. 1,29,999 ఎక్స్-షోరూమ్ ధర పలకగా, జూలైలో 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ను కస్టమర్లు ఏథెర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లలో బుక్ చేసుకోవచ్చని సూచించింది. జూన్ 1 నుంచి ఫేమ్-2 కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ 15 శాతానికి తగ్గింది. దీంతో 450 ఎక్స్ వాహనం ధర పెరగనుంది. మే 31లోగా కొనుగోలు చేసిన వారికి రూ.32,500 వరకు ఆదా చేసుకోవచ్చని సంస్థ ఇటీవలే వివరించింది. 450 ఎక్స్ కొత్త ధరలను మాత్రం సంస్థ స్పష్టంగా ప్రకటించాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల ఈవీ పాలసీల మేరకు వినియోగదారులు సబ్సిడీ ప్రయోజనాలను అందుకోవచ్చని చెప్పింది.