Loading...
Maruti Suzuki: భారత్‌లో కార్ల మార్కెట్‌ జోరు.. 7 కొత్త ఎస్‌యూవీలతో మారుతీ సుజుకీ భారీ ప్లాన్
భారత్‌లో కార్ల మార్కెట్‌ జోరు.. 7 కొత్త ఎస్‌యూవీలతో మారుతీ సుజుకీ భారీ ప్లాన్

Maruti Suzuki: భారత్‌లో కార్ల మార్కెట్‌ జోరు.. 7 కొత్త ఎస్‌యూవీలతో మారుతీ సుజుకీ భారీ ప్లాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2026
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్‌ రానున్న సంవత్సరాల్లో మరింత వేగంగా విస్తరించనుందని దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అంచనా వేసింది. 2031 ఆర్థిక సంవత్సరం (FY31) నాటికి దేశీయ ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్‌ 63 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని కంపెనీ ఛైర్మన్‌ ఆర్‌.సి. భార్గవ తెలిపారు. చిన్న కార్లకు డిమాండ్‌ మళ్లీ పుంజుకోవడం, ఎస్‌యూవీలకు కొనసాగుతున్న ఆదరణ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. మారుతీ సుజుకీ FY26 వార్షిక నివేదికను విడుదల సందర్భంగా భార్గవ ఈ అంచనాలను వెల్లడించారు.

వివరాలు

చిన్న కార్ల మార్కెట్‌పై కొత్త అంచనాలు

గత ఐదేళ్లతో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో చిన్న కార్ల విభాగం మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని మారుతీ సుజుకీ భావిస్తోంది.

దీంతో కంపెనీ తన ఐదేళ్ల వృద్ధి లక్ష్యాలను పునఃసమీక్షిస్తోంది. చిన్న కార్లకు డిమాండ్‌ పెరిగితే విక్రయాలు, ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత వేగంగా పెంచుకునేందుకు మారుతీకి అవకాశం లభించనుంది.

మారుతీ సుజుకీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ హిసాషి టకేఉచి మాట్లాడుతూ.. వచ్చే ఐదారు సంవత్సరాల్లో ఏడు కొత్త ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు.

ఇప్పటికే గ్రాండ్‌ విటారా, బ్రెజ్జా, ఫ్రాంక్స్‌ వంటి మోడళ్లతో మారుతీ తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.

వివరాలు

రూ.35 వేల కోట్ల పెట్టుబడి

పెరగనున్న వాహన డిమాండ్‌ను అందుకునేందుకు FY31 నాటికి మారుతీ సుజుకీ రూ.35,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.

దాదాపు 4 బిలియన్‌ డాలర్లకు సమానమైన ఈ పెట్టుబడులతో కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 36.5 లక్షల వాహనాలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఉత్పత్తి సామర్థ్య విస్తరణ ప్రణాళికలను కూడా కంపెనీ వేగవంతం చేసింది. FY27లోనే అదనంగా 5 లక్షల వాహనాల తయారీ సామర్థ్యాన్ని జోడించనుంది.

ఈ నిర్ణయం FY26లో కంపెనీ నమోదు చేసిన రికార్డు విక్రయాల నేపథ్యంలో వచ్చింది. ఆ ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ మొత్తం 24.2 లక్షల వాహనాలను విక్రయించింది.

అదే సమయంలో ఎగుమతులు కూడా ఆల్‌టైమ్‌ హైకి చేరి 4.47 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి.

ADVERTISEMENT

వివరాలు

స్థానిక తయారీపై దృష్టి

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలో అంతరాయాల వల్ల ఎదురయ్యే నష్టాలను తగ్గించుకునేందుకు మారుతీ సుజుకీ స్థానికీకరణ, ప్రత్యామ్నాయ సోర్సింగ్‌పై దృష్టి పెడుతోంది.

ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్న క్రమంలో సరఫరాదారుల సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు దేశీయంగా విడిభాగాల సేకరణను మరింత పెంచాలని కంపెనీ భావిస్తోంది.

చిన్న కార్లకు డిమాండ్‌ పునరుద్ధరణ, ఎస్‌యూవీలకు కొనసాగుతున్న ఆదరణతో భారత ప్యాసింజర్‌ వాహన మార్కెట్‌ తదుపరి దశ వృద్ధిని సాధిస్తుందని మారుతీ అంచనా వేస్తోంది.

అందుకు అనుగుణంగా ఈ స్థానికీకరణ వ్యూహాన్ని అమలు చేయనుంది.

మారుతీ సుజుకీ తన మాతృ సంస్థ సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌తో అనుసంధానాన్ని కూడా మరింత బలోపేతం చేసుకుంది.

ADVERTISEMENT

వివరాలు

సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌తో మరింత అనుసంధానం

రెండు సంస్థల మధ్య సన్నిహిత సహకారం వల్ల కొత్త వాహనాల అభివృద్ధి సమయాన్ని తగ్గించడంతో పాటు ఉత్పత్తి వ్యయాలను కూడా తగ్గించుకోవచ్చని కంపెనీ భావిస్తోంది.

మరోవైపు పర్యావరణహిత ఇంధన వ్యూహంలో భాగంగా బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటుపైనా మారుతీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నాలుగు బయోగ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ బోర్డు ప్రారంభంగా రూ.561 కోట్ల పెట్టుబడికి ఆమోదం తెలిపింది.

మొత్తంగా చిన్న కార్లకు మళ్లీ పెరుగుతున్న డిమాండ్‌, ఎస్‌యూవీల విస్తరణ, భారీ పెట్టుబడులు, ఉత్పత్తి సామర్థ్యం పెంపు, స్థానికీకరణ వంటి చర్యలతో భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో తదుపరి దశ వృద్ధికి సిద్ధమవుతున్నట్లు మారుతీ సుజుకీ తాజా ప్రణాళికలు సూచిస్తున్నాయి.

ADVERTISEMENT