Loading...
Bharat NCAP : 2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ NCAP 2.0.. వాహనాల భద్రతా పరీక్షల్లో కీలక మార్పులు
2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ NCAP 2.0.. వాహనాల భద్రతా పరీక్షల్లో కీలక మార్పులు

Bharat NCAP : 2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ NCAP 2.0.. వాహనాల భద్రతా పరీక్షల్లో కీలక మార్పులు

వ్రాసిన వారు Moogati Shabari
Sep 03, 2026
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో వాహనాల భద్రతా ప్రమాణాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న భారత్‌ NCAPకు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా తీసుకురానున్న భారత్‌ NCAP 2.0ను 2027 అక్టోబర్‌ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. గురువారం జరిగిన SIAM వార్షిక సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌ NCAP 2.0లో వాహన భద్రతను మరింత సమగ్రంగా పరీక్షించనున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులకు ఎంత రక్షణ లభిస్తోంది అన్నదే కాకుండా.. ప్రమాదాలను ముందుగానే నివారించే సామర్థ్యం, పాదచారుల భద్రత, వారికి అందించే సంరక్షణ వంటి అంశాలను కూడా పరీక్షల్లో భాగం చేయనున్నారు.

వివరాలు

భారత్‌ NCAPపై గడ్కరీ ప్రశంసలు

భారత్‌ NCAPను నితిన్‌ గడ్కరీ విజయవంతమైన కార్యక్రమంగా అభివర్ణించారు.

ప్రభుత్వం, ఆటో మొబైల్‌ పరిశ్రమ పరస్పర సహకారంతో ఈ కార్యక్రమం మంచి ఫలితాలు సాధిస్తోందని పేర్కొన్నారు.

ఇప్పటివరకు 11 కంపెనీలకు చెందిన 30కి పైగా మోడళ్లకు భారత్‌ NCAP కింద భద్రతా ధ్రువీకరణ లభించిందని తెలిపారు.

గ్లోబల్‌ NCAPతో పోలిస్తే భారత్‌ NCAPలో వాహనాల పరీక్ష ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని గడ్కరీ వివరించారు.

భారత్‌లో ఒక మోడల్‌ను పరీక్షించేందుకు సుమారు రూ.60 లక్షలు ఖర్చవుతుండగా.. ఇతర ప్రాంతాల్లో ఇదే పరీక్షకు దాదాపు రూ.2.5 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు.

వివరాలు

డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌కు పాయింట్ల విధానం..

డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లకు గ్రేడెడ్‌ పాయింట్ల విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు గడ్కరీ తెలిపారు.

ఈ ప్రతిపాదిత విధానంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు డ్రైవర్ల ఖాతాలో పాయింట్లు తగ్గించనున్నారు.

ఒక నిర్దిష్ట పరిమితిని దాటితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేయడం లేదా రద్దు చేసే అవకాశం ఉంటుంది.

మరోవైపు బాధ్యతాయుతంగా వాహనాలు నడిపే డ్రైవర్లను ప్రోత్సహించేలా బీమా కంపెనీల నుంచి ప్రోత్సాహకాలు లేదా ఇతర ప్రయోజనాలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలించవచ్చని గడ్కరీ తెలిపారు.

పదేపదే ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ విధానం ఉండనుంది.

ADVERTISEMENT

వివరాలు

డ్రైవర్‌ శిక్షణకు CSR సహకారం అవసరం

డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలు, వాహనాల ఫిట్‌నెస్‌ కేంద్రాలు, పాత వాహనాలను స్క్రాప్‌ చేసే కేంద్రాలకు ఆటోమొబైల్‌ కంపెనీలు సహకరించాలని గడ్కరీ కోరారు.

ఇందుకోసం కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని లేదా ఆర్థికంగా ఆచరణీయమైన నమూనాలను రూపొందించాలని సూచించారు.

ముఖ్యంగా అభివృద్ధి ఆకాంక్షించే జిల్లాలు, వెనుకబడిన ప్రాంతాల్లో శిక్షణ పొందిన డ్రైవర్ల కొరత ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు.

డ్రైవర్లు అందుబాటులో లేకపోవడంతో బెంగళూరులో ఓ బస్సు ఆపరేటర్‌కు చెందిన 1,000 బస్సులు ఖాళీగా ఉండిపోయిన విషయాన్ని గడ్కరీ ఉదాహరణగా ప్రస్తావించారు.

ఈ సమస్య తీవ్రతను ఇది తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT