LOADING...
E85 fuel: ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు ఊతం.. నేటి నుంచి E85 ఇంధనం
ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు ఊతం.. నేటి నుంచి E85 ఇంధనం

E85 fuel: ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు ఊతం.. నేటి నుంచి E85 ఇంధనం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2026
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నుంచి చమురు మార్కెటింగ్ సంస్థలు E85 ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి. పెట్రోల్‌లో 80 నుంచి 85 శాతం ఇథనాల్ మిశ్రమంతో తయారైన ఈ ఇంధనం ప్రత్యేకంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల కోసం రూపొందించబడింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) తెలిపిన వివరాల ప్రకారం తొలి దశలో ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, పుణె, నాగ్‌పూర్ నగరాల్లోని సుమారు 50 పెట్రోల్ బంకుల్లో E85 విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఇతర చమురు మార్కెటింగ్ సంస్థలతో కలిసి ఈ కొత్త ఇంధనాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఇండియన్ ఆయిల్ వెల్లడించింది.

వివరాలు 

పర్యావరణహితమైన ఇంధన ప్రత్యామ్నాయం కూడా అందుబాటులోకి..

E85 ఇంధనంలో 80-85 శాతం ఇథనాల్,15-20 శాతం సాధారణ పెట్రోల్ ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి బలం చేకూరడంతో పాటు స్వచ్ఛమైన రవాణా వ్యవస్థకు ఊతం లభిస్తుందని,బయోఫ్యూయల్ రంగం అభివృద్ధి చెందుతుందని,రైతులకు ప్రయోజనం కలుగుతుందని ఇండియన్ ఆయిల్ పేర్కొంది. వినియోగదారులకు పర్యావరణహితమైన ఇంధన ప్రత్యామ్నాయం కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి కేంద్ర పెట్రోలియం,సహజ వాయు శాఖ మంత్రి,మంత్రిత్వ శాఖ కార్యదర్శి,ఉన్నతాధికారులు,చమురు మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా, మారుతీ సుజుకీ తన ప్రముఖ వ్యాగన్‌ఆర్ మోడల్‌కు, హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ బైక్‌కు ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్లను ఇప్పటికే పరిచయం చేసింది. దీంతో E85 వంటి అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగానికి మార్గం సుగమమవుతోంది.

వివరాలు 

ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే ప్రయత్నం

భారత్ ప్రస్తుతం తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. ఇందుకోసం ప్రతి ఏడాది 120 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధం వంటి పరిణామాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు తరచూ హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగుమతి చమురుపై ఆధారాన్ని తగ్గించి, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్స్-ఫ్యూయల్ విధానాన్ని వేగవంతం చేస్తోంది.

Advertisement

వివరాలు 

2003లో ఫ్లెక్స్-ఫ్యూయల్ విధానాన్ని ప్రవేశపెట్టిన బ్రెజిల్

రవాణా రంగంలో పెట్రోల్ వినియోగం అధికంగా ఉండటంతో, ఈ రంగంలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం దేశ ఇంధన భద్రతకు కీలకంగా మారింది. 2003లో ఫ్లెక్స్-ఫ్యూయల్ విధానాన్ని ప్రవేశపెట్టిన బ్రెజిల్ ప్రస్తుతం ఈ రంగంలో విజయవంతమైన దేశంగా నిలిచింది. అక్కడ 90 శాతానికి పైగా కార్లు, ద్విచక్ర వాహనాలు ఇథనాల్, పెట్రోల్ లేదా రెండింటి మిశ్రమంతో నడుస్తున్నాయి.

Advertisement