LOADING...
Adani Group: పునరుత్పాదక ఇంధనంతో ఏఐ డేటా సెంటర్లు: అదానీ గ్రూప్‌ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి
అదానీ గ్రూప్‌ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి

Adani Group: పునరుత్పాదక ఇంధనంతో ఏఐ డేటా సెంటర్లు: అదానీ గ్రూప్‌ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2026
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

పునరుత్పాదక ఇంధన ఆధారంగా పనిచేసే హైపర్‌స్కేల్ ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి అదానీ గ్రూప్ భారీ స్థాయిలో ముందడుగు వేసింది. ఈ దిశగా సుమారు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన సంస్థ, 2035 నాటికి ఈ డేటా సెంటర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని మంగళవారం వెల్లడించింది. ఈ ప్రాజెక్టు అమలుతో సర్వర్ల తయారీ, క్లౌడ్ సేవలు తదితర అనుబంధ రంగాల్లో మరింతగా 150 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశముందని తెలిపింది. ప్రపంచం ప్రస్తుతం ఒక కొత్త ఇంటెలిజెన్స్ విప్లవం దిశగా సాగుతోందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. భవిష్యత్తును నిర్ణయించేది ఇంధన వనరులు,కంప్యూటింగ్ సామర్థ్యాల మధ్య సమతుల్యత సాధించిన దేశాలేనని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

5 గిగావాట్లకు విస్తరించాలనే లక్ష్యం 

ఈ మార్పులో నాయకత్వం వహించేందుకు భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఏఐ యుగంలో భారత్ కేవలం వినియోగదారుల దేశంగా మాత్రమే కాకుండా,సాంకేతిక సృష్టికర్తగా, ఇంటెలిజెన్స్‌ను ఎగుమతి చేసే దేశంగా ఎదుగుతుందని గౌతమ్ అదానీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తమకు గర్వకారణమని ఆయన అన్నారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ వద్ద 2 గిగావాట్ల సామర్థ్యంతో పనిచేసే డేటా సెంటర్లు ఉండగా,వాటిని 5 గిగావాట్లకు విస్తరించాలనే లక్ష్యాన్ని సంస్థ పెట్టుకుంది. ఈ విస్తరణలో భాగంగా,విశాఖపట్నంలో గిగావాట్ సామర్థ్యంతో ఏటా డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా,హైదరాబాద్,పుణే నగరాల్లో డేటా సెంటర్ల స్థాపన కోసం మైక్రోసాఫ్ట్తో కూడా అవగాహన ఒప్పందం చేసుకుంది.

Advertisement