LOADING...
ATM: దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? ఆర్‌బీఐ వద్ద క్యాట్‌మి కీలక ఫిర్యాదు!
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? ఆర్‌బీఐ వద్ద క్యాట్‌మి కీలక ఫిర్యాదు!

ATM: దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? ఆర్‌బీఐ వద్ద క్యాట్‌మి కీలక ఫిర్యాదు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడతాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు,గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలు భారీ సంఖ్యలో సేవలు నిలిపివేసే ప్రమాదం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (క్యాట్‌మి) హెచ్చరించింది. ఈ సమస్యపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దృష్టికి తీసుకెళ్లిన క్యాట్‌మి,దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ నగదు పంపిణీ విధానమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. క్యాట్‌మి వివరాల ప్రకారం,ఎస్‌బీఐ టైర్-1 నగరాల్లోని ఏటీఎంలకు అవసరానికి మించి నగదును సరఫరా చేస్తుండగా,టైర్-2,టైర్-3 నగరాలు,చిన్న పట్టణాలు,గ్రామాల్లోని ఏటీఎంలకు నగదు కొరత ఏర్పడుతోంది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పాటు, అనేక ఏటీఎంలను మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

వివరాలు 

ఎస్‌బీఐకి సుమారు 65 వేల ఏటీఎంల నెట్‌వర్క్

ఈ కారణంగా బ్యాంకింగ్ రంగం నుంచి రూ.100 కోట్ల నష్టపరిహారం కూడా కోరింది. ఈటీ నివేదిక ప్రకారం, జూన్ 5న ఆర్‌బీఐ, ఎస్‌బీఐ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఏటీఎం ఆపరేటర్లు ఈ సమస్యను ప్రస్తావించారు. దేశంలో ఎస్‌బీఐకి సుమారు 65 వేల ఏటీఎంల నెట్‌వర్క్ ఉంది. ఇందులో దాదాపు సగం ఏటీఎంలను బ్యాంకే నేరుగా నిర్వహిస్తోంది. వీటిలో అధిక శాతం మెట్రో నగరాల్లో ఉండగా, చిన్న పట్టణాలు, గ్రామాల్లో నగదు కొరత ఎక్కువగా కనిపిస్తోందని వెల్లడించారు. ఈ పరిస్థితి వల్ల ఏటీఎం ఆపరేటర్లు భారీ ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు నామ్ సీఈఓ తెలిపారు. చిన్న బ్యాంకులు పరిస్థితిని తట్టుకుంటున్నప్పటికీ, ఎస్‌బీఐ సంబంధిత ఏటీఎంలలో సమస్య తీవ్రంగా ఉందన్నారు.

వివరాలు 

రూ.100 కోట్లకు పైగా నష్టాలు 

మెట్రో నగరాలకు అధిక మొత్తంలో నగదు మళ్లిపోవడం వల్ల ఇతర ప్రాంతాల్లో నగదు సరఫరా తగ్గిపోతోందని పేర్కొన్నారు. దీంతో ఏటీఎంలు సక్రమంగా పనిచేయకపోవడంతో లావాదేవీలు తగ్గి, ఇంటర్‌ఛేంజ్ ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం కూడా కోల్పోతున్నట్లు చెప్పారు. ఈ రంగం ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా నష్టాలను చవిచూసిందని వెల్లడించారు. జూన్ 20లోగా ఈ సమస్యను ఎస్‌బీఐ పరిష్కరించకపోతే, దేశవ్యాప్తంగా అనేక ఏటీఎంలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని క్యాట్‌మి హెచ్చరించింది. ఇప్పటికే చాలా తక్కువ లాభాలతో పనిచేస్తున్న ఏటీఎం ఆపరేటర్లపై పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, తగ్గుతున్న వినియోగం అదనపు భారం మోపుతున్నాయని తెలిపింది.

Advertisement

వివరాలు 

పెంపు,ఇంధన ధరల పెరుగుదల ప్రధాన కారణాలు 

చిన్న పట్టణాల్లోని ఏటీఎంలు ఎక్కువగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని క్యాట్‌మి పేర్కొంది. ఎస్‌బీఐ టైర్-1 నగరాల్లోని ఏటీఎంలకు అధికంగా నగదు పంపించడం వల్ల ఇతర ప్రాంతాల్లో నగదు కొరత ఏర్పడుతోందని తెలిపింది. మరోవైపు ప్రజలు ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రాలు చేయడం క్రమంగా తగ్గుతున్నప్పటికీ, వాటి నిర్వహణ ఖర్చులు మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయి. ఏటీఎం నిర్వహణ వ్యయాల పెరుగుదలకు కనీస వేతనాల్లో సుమారు 60 శాతం పెంపు,ఇంధన ధరల పెరుగుదల ప్రధాన కారణాలని ఆపరేటర్లు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

2024-25 నాటికి 2.51 లక్షలకు పడిపోయిన ఏటీఎంల సంఖ్య

ఇదే సమయంలో దేశవ్యాప్తంగా నెలవారీ ఏటీఎం నగదు ఉపసంహరణలు జనవరి 2023లో 57 కోట్లుగా ఉండగా, సెప్టెంబర్ 2025 నాటికి అవి 43.9 కోట్లకు తగ్గిపోయాయి. అలాగే దేశంలోని ఏటీఎంల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఏడాది క్రితం 2.53 లక్షలకు పైగా ఉన్న ఏటీఎంల సంఖ్య 2024-25 నాటికి సుమారు 2.51 లక్షలకు పడిపోయింది. ఈ తగ్గుదలలో ఎక్కువ భాగం గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే నమోదైనట్లు సమాచారం.

Advertisement