Loading...
EPF Wage ceiling: ఈపీఎఫ్‌ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం
పీఎఫ్‌ వేతన పరిమితి రూ.25,000కు పెంపు.. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం

EPF Wage ceiling: ఈపీఎఫ్‌ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2026
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగుల భవిష్యనిధి (EPF) గరిష్ఠ వేతన పరిమితిని పెంచే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం నెలకు రూ.15 వేలుగా ఉన్న పరిమితిని రూ.25 వేలకు పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 17 నుంచే ఈ సవరణ అమల్లోకి రానున్నట్లు కేంద్రం తెలిపింది.

వివరాలు 

12 ఏళ్లుగా పెరగని పరిమితి

ఈపీఎఫ్‌ వేతన పరిమితిని పెంచాలనే డిమాండ్‌ చాలాకాలంగా ఉంది.

జీవన వ్యయం పెరుగుతున్నప్పటికీ దాదాపు 12ఏళ్లుగా గరిష్ఠ వేతన పరిమితిలో ఎలాంటి మార్పు లేదు.

2014లో చివరిసారిగా ఈ పరిమితిని రూ.6,500 నుంచి రూ.15వేలకు పెంచారు.

అప్పటి నుంచి వేతన పరిమితిని సవరించాలని కార్మిక సంఘాలు పలుమార్లు కేంద్రాన్ని కోరుతున్నాయి.

తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

51 లక్షలకుపైగా ఉద్యోగులకు ప్రయోజనం

వేతన పరిమితి పెంపు నిర్ణయం వల్ల అదనంగా 51లక్షలకుపైగా ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

వీరంతా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) పరిధిలోకి రానున్నారు.

ఈ నిర్ణయం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.11,339కోట్లు ఖర్చు చేయనుందని ఆయన వెల్లడించారు.

వివరాలు 

పీఎఫ్‌, పెన్షన్‌ ప్రయోజనాలు మరింత మందికి 

ప్రస్తుతం నెలకు రూ.15 వేలకుపైగా వేతనంతో ఉద్యోగంలో చేరే కొత్త ఉద్యోగి ఆటోమేటిక్‌గా ఈపీఎఫ్‌ పరిధిలోకి రావడం లేదు.

దీంతో కొందరు ఉద్యోగులు తప్పనిసరి ప్రావిడెంట్‌ ఫండ్‌ (PF), పెన్షన్‌, ఉద్యోగుల డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ (EDLI) వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలకు దూరంగా ఉంటున్నారు.

వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచడం వల్ల రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య వేతనం పొందుతున్న ఉద్యోగుల్లో గణనీయమైన సంఖ్యలో చట్టబద్ధమైన సామాజిక భద్రతా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

తాజా సవరణకు అనుగుణంగా పీఎఫ్‌ పొదుపు, ఉద్యోగుల పెన్షన్‌ పథకం (EPS) కింద లభించే పెన్షన్‌ మొత్తాలు కూడా పెరుగుతాయని కేంద్రం పేర్కొంది.

ADVERTISEMENT