LOADING...
China: ఏఐ డిమాండ్‌, చమురు ధరల ప్రభావం.. రెండేళ్ల గరిష్ఠానికి చైనా ఫ్యాక్టరీల లాభాలు
ఏఐ డిమాండ్‌,చమురు ధరల ప్రభావం.. రెండేళ్ల గరిష్ఠానికి చైనా ఫ్యాక్టరీల లాభాలు

China: ఏఐ డిమాండ్‌, చమురు ధరల ప్రభావం.. రెండేళ్ల గరిష్ఠానికి చైనా ఫ్యాక్టరీల లాభాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో పారిశ్రామిక రంగం లాభాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫ్యాక్టరీల లాభాలు 24.7 శాతం పెరిగినట్లు చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్‌) వెల్లడించింది. ఇది రెండేళ్లలోనే అత్యధిక వృద్ధి కావడం విశేషం. మార్చిలో ఈ వృద్ధి 15.8 శాతంగా నమోదైంది. ఇక ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో మొత్తం లాభాలు 18 శాతానికి పైగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

ఏఐ డిమాండ్‌, చమురు ధరల పెరుగుదలతో లాభాల జోరు

పారిశ్రామిక లాభాలు భారీగా పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ)కు సంబంధించిన ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం ఒకటి కాగా.. అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు ధరలు పెరగడం మరో కారణంగా పేర్కొంటున్నారు. ఈ పరిణామాలతో చైనాలో ఫ్యాక్టరీ ద్రవ్యోల్బణం 2022 జూలై తర్వాత అత్యధిక స్థాయికి చేరింది. దీంతో చమురు, గ్యాస్ కంపెనీల వంటి ఉత్పత్తిదారుల ఆదాయాలు పెరిగాయి.

వివరాలు 

గృహ వినియోగ వ్యయం బలహీనత ప్రభావం

ఏఐ రంగంలో పెట్టుబడులు పెరగడంతో చైనా తయారు చేసే చిప్స్‌, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్‌ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయినప్పటికీ వినియోగదారుల ఖర్చులు, ప్రైవేట్ పెట్టుబడులు బలహీనంగానే ఉండటంతో వినియోగ ద్రవ్యోల్బణం పెద్దగా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ముడిసరుకు ధరల పెరుగుదల భారం వినియోగదారులపై మోపడం దిగువ స్థాయి పరిశ్రమలకు కష్టంగా మారొచ్చని చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

రంగాల మధ్య లాభాల అసమానత స్పష్టమే

చమురు ధరల పెరుగుదల, ఏఐ బూమ్ వల్ల కొన్ని రంగాలు భారీ లాభాలు పొందుతుండగా.. దుస్తులు, చెప్పులు, ఫర్నిచర్ తయారీ రంగాలు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బలహీనమైన డిమాండ్‌, అధిక ఉత్పత్తి కారణంగా చైనా పరిశ్రమల్లో తీవ్ర ధరల పోటీ కొనసాగుతోంది. గత ఏడాది చివరికి పారిశ్రామిక సంస్థల లాభ మార్జిన్ 5.3 శాతానికి పడిపోయింది. 2014లో రికార్డులు ప్రారంభమైన తర్వాత ఇదే కనిష్ఠ స్థాయిగా నమోదైంది.

Advertisement