GST-UPI: జీఎస్టీ, యూపీఐ లావాదేవీల్లో దూకుడు.. ఆగస్టులో భారీగా పెరిగిన వృద్ధి
ఈ వార్తాకథనం ఏంటి
దేశ ఆర్థిక కార్యకలాపాల తీరును సూచించే వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు ఆగస్టులోనూ బలమైన వృద్ధిని నమోదు చేశాయి. జీఎస్టీ వసూళ్లు మరోసారి రూ.2 లక్షల కోట్ల స్థాయిని దాటగా.. యూపీఐ లావాదేవీలు కూడా రికార్డు స్థాయికి చేరువలో నమోదయ్యాయి. ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే వసూళ్లలో 14.8 శాతం పెరుగుదల నమోదైంది. ఇందులో దేశీయ లావాదేవీల ద్వారా రూ.1.37 లక్షల కోట్లు సమకూరగా.. దిగుమతులపై వసూలైన జీఎస్టీ ద్వారా మరో రూ.62,604 కోట్లు వచ్చినట్లు కేంద్రం తెలిపింది.
వివరాలు
జీఎస్టీ ఆదాయం రూ.1.68 లక్షల కోట్లు
పన్నుల విభాగాల వారీగా చూస్తే.. సెంట్రల్ జీఎస్టీ (CGST) ద్వారా రూ.38,413 కోట్లు వసూలయ్యాయి. స్టేట్ జీఎస్టీ (SGST) వసూళ్లు రూ.46,316 కోట్లుగా నమోదయ్యాయి.
సమీకృత జీఎస్టీ (IGST) ద్వారా రూ.1.15 లక్షల కోట్లు ఖజానాకు చేరాయి. రిఫండ్లను మినహాయించిన తర్వాత కూడా జీఎస్టీ వసూళ్లు గణనీయంగానే ఉన్నాయి.
నికర జీఎస్టీ ఆదాయం 8.3 శాతం వృద్ధితో రూ.1.68 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
వివరాలు
యూపీఐ లావాదేవీల్లోనూ జోరు
దేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకంగా మారిన యూపీఐ ద్వారా ఆగస్టులో రూ.29.8లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.
ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది.
గత ఏడాది ఆగస్టులో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.24.85 లక్షల కోట్లు. దీంతో ఏడాది వ్యవధిలో లావాదేవీల విలువలో 20 శాతం వృద్ధి నమోదైంది.
ఈ ఏడాది మే, జులై నెలల్లో యూపీఐ లావాదేవీల విలువ ఒక్కో నెలలో రూ.29.9 లక్షల కోట్లుగా నమోదై రికార్డు సృష్టించింది.
వివరాలు
యూపీఐ లావాదేవీల్లోనూ జోరు
ఆగస్టులోనూ రూ.29.8 లక్షల కోట్ల లావాదేవీలు జరగడంతో మరోసారి రికార్డు స్థాయికి చేరువైనట్లు స్పష్టమవుతోంది.
లావాదేవీల సంఖ్య పరంగానూ యూపీఐ వినియోగం పెరిగింది. జులైలో మొత్తం 23.66 బిలియన్ యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి.
ఆగస్టులో ఈ సంఖ్య మరింత పెరిగి 24.51 బిలియన్లకు చేరింది. దీంతో విలువతో పాటు లావాదేవీల సంఖ్యలోనూ యూపీఐకు ప్రజల్లో ఆదరణ కొనసాగుతున్నట్లు వెల్లడైంది.