Crude Oil: గల్ఫ్లో మళ్లీ యుద్ధ మేఘాలు.. 3%కుపైగా పెరిగిన అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు గల్ఫ్ ప్రాంతంలో మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్ తన సైనిక చర్యలను ఖతార్, యూఏఈ వంటి దేశాల వరకు విస్తరించడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్పై వెంటనే కనిపించింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే అంతర్జాతీయ ముడిచమురు ధరలు 3 శాతానికి పైగా పెరిగాయి. హర్మూజ్ జలసంధి గుండా జరిగే చమురు, ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చనే భయాలు మళ్లీ మార్కెట్లను కలవరపెడుతున్నాయి.
వివరాలు
3 శాతానికి పైగా పెరిగిన చమురు ధరలు
సోమవారం ఉదయం అంతర్జాతీయ ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర బ్యారెల్కు 2.46 డాలర్లు (3.24 శాతం) పెరిగి 78.47 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర కూడా 2.36 డాలర్లు (3.30 శాతం) పెరిగి బ్యారెల్కు 73.77 డాలర్ల వద్ద ట్రేడైంది. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
వివరాలు
హర్మూజ్ జలసంధిలో రవాణాపై ప్రభావం
ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా ముడిచమురు, ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్జీ) ఎగుమతులకు ఈ జలమార్గం అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. అనుమతి లేని ఓ నౌకపై దాడి చేశామని, ఈ జలమార్గాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు, వాణిజ్య నౌకల రాకపోకలకు హర్మూజ్ జలసంధి అందుబాటులోనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే, షిప్ ట్రాకింగ్ డేటా సంస్థ 'కెప్లర్' వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం కేవలం ఆరు నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించాయి. గత ఐదు వారాల్లో నమోదైన అత్యల్ప రాకపోకలు ఇవేనని నివేదిక పేర్కొంది. దీంతో అంతర్జాతీయ చమురు సరఫరాపై ఆందోళనలు మరింత పెరిగాయి.
వివరాలు
శాంతి ఒప్పందం భవిష్యత్తుపై అనిశ్చితి
తాజా ఘర్షణలతో గత నెల వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం కొనసాగుతుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. 60 రోజుల పాటు శాంతి చర్చలు నిర్వహిస్తూ హర్మూజ్ జలసంధిలో సాధారణ రవాణాను పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరింది. అయితే తాజా పరిణామాలు ఆ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
సరఫరాపై కొనసాగుతున్న ఆందోళనలు
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) వివరాల ప్రకారం జూన్ నెలలో ప్రపంచ చమురు సరఫరా కొంత మేర పెరిగినప్పటికీ, యుద్ధానికి ముందు నమోదైన సాధారణ స్థాయితో పోలిస్తే రోజుకు 9.4 మిలియన్ బ్యారెళ్ల మేర తక్కువగానే ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభం త్వరలో ముగిసే సూచనలు కనిపించడం లేదని, ప్రపంచ ఇంధన మార్కెట్లపై దీని ప్రభావం మరికొంతకాలం కొనసాగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.