India's Wholesale Inflation: జూలైలో 9.78 శాతానికి తగ్గిన హోల్సేల్ ద్రవ్యోల్బణం.. పెరిగిన ఆహార,తయారీ ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో హోల్సేల్ ద్రవ్యోల్బణం (WPI) జూలైలో స్వల్పంగా తగ్గింది. జూన్లో 9.87 శాతంగా ఉన్న హోల్సేల్ ద్రవ్యోల్బణం జూలైలో 9.78 శాతానికి చేరినట్లు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఇంధనం, విద్యుత్ ధరల ద్రవ్యోల్బణం తగ్గడం మొత్తం WPIపై ప్రభావం చూపింది. రాయిటర్స్ నిర్వహించిన ఆర్థికవేత్తల సర్వేలో జూలైలో హోల్సేల్ ద్రవ్యోల్బణం 9.95 శాతంగా ఉంటుందని అంచనా వేయగా.. వాస్తవ గణాంకం దానికంటే తక్కువగా నమోదైంది. కొత్త హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) సిరీస్లో జూన్లో నమోదైన 9.87 శాతమే ఇప్పటివరకు అత్యధికం. ఈ కొత్త సిరీస్కు 2022-23ను ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకున్నారు.
వివరాలు
ఇంధనం, విద్యుత్ ధరల ద్రవ్యోల్బణం భారీగా తగ్గుదల
జూలైలో హోల్సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల కావడానికి రెండు రోజుల ముందు కేంద్రం రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన గణాంకాలను ప్రకటించింది.
జూన్లో 4.38 శాతంగా ఉన్న వినియోగదారుల ధరల సూచీ(CPI)ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 4.45 శాతానికి పెరిగింది.
ప్రధానంగా ఆహార ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం పైకి వెళ్లింది.
తాజాగా విడుదలైన WPI గణాంకాలు చూస్తే.. జూలైలో మొత్తం హోల్సేల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గినప్పటికీ, ధరల ఒత్తిడి మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇంధనం, విద్యుత్ ధరల ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది. జూన్లో 27.41శాతంగా ఉన్న ఈ విభాగం ద్రవ్యోల్బణం జూలైలో 20.05 శాతానికి పడిపోయింది.
గత కొన్ని నెలలుగా హోల్సేల్ ధరల పెరుగుదలలో ఇంధనం, విద్యుత్ ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉన్నాయి.
వివరాలు
ఇంధన ధరలు తగ్గినా.. పెరిగిన ఆహార ధరల ద్రవ్యోల్బణం
మేలో ఈ విభాగం ద్రవ్యోల్బణం 30.33 శాతంగా ఉండగా.. జూన్లో 27.41 శాతానికి తగ్గింది.
జూలైలో మరింత తగ్గడంతో WPIలోని ఇతర విభాగాల్లో పెరిగిన ధరల ఒత్తిడిని ఇది కొంతమేర తగ్గించింది.
మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై మళ్లీ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగితే వ్యాపార సంస్థలకు ముడి సరుకు, రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపవచ్చు.
ఆహార ధరల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
WPI ఆహార సూచీలో ద్రవ్యోల్బణం జూన్లో 6.14 శాతం ఉండగా.. జూలైలో 6.65 శాతానికి పెరిగింది.
వివరాలు
ఆహార ధరల పెరుగుదలతో కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిడి
ప్రాథమిక వస్తువుల విభాగంలోని ఆహార పదార్థాలతో పాటు తయారీ చేసిన ఆహార ఉత్పత్తులను కూడా ఈ ఆహార సూచీలో పరిగణిస్తారు.
మేలో 4.49 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జూన్లో భారీగా పెరిగింది. తాజాగా జూలైలోనూ మరింత పైకి వెళ్లింది.
రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలతోనూ ఈ గణాంకాలు సరిపోలుతున్నాయి.
తాజా CPI గణాంకాల ప్రకారం.. జూలైలో వినియోగదారుల ఆహార ద్రవ్యోల్బణం 5.52 శాతానికి చేరింది.
కూరగాయలు, ఇతర త్వరగా పాడయ్యే ఆహార పదార్థాల ధరలు పెరగడం ధరల ఒత్తిడికి ప్రధాన కారణంగా ఉంది.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అసమాన వర్షపాతం సరఫరాపై ప్రభావం చూపింది.
వివరాలు
ప్రాథమిక,తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం పెరుగుదల
ప్రాథమిక వస్తువుల ధరల ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. జూన్లో 7 శాతంగా ఉన్న ప్రైమరీ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం జూలైలో 8.52 శాతానికి చేరింది.
ఈ విభాగంలో ఆహార పదార్థాలు, ఖనిజాలు, ముడి చమురు, సహజ వాయువు వంటి వస్తువులు ఉంటాయి.
దీంతో మొత్తం WPI ద్రవ్యోల్బణం కొంత తగ్గినప్పటికీ.. ముడి సరుకులు, ప్రాథమిక వస్తువుల ధరలపై ఒత్తిడి మాత్రం కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
తయారీ ఉత్పత్తుల ధరల ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. జూన్లో 7.48 శాతంగా ఉన్న తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూలైలో 8.29 శాతానికి చేరింది.
ఇది కీలకమైన పరిణామంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే WPI బాస్కెట్లో తయారీ ఉత్పత్తులకే అత్యధిక వెయిటేజీ ఉంది.
వివరాలు
WPIలో మిశ్రమ ఫలితాలు.. తగ్గిన ఇంధన ధరలు, పెరిగిన ఆహార-తయారీ ఉత్పత్తుల ధరలు
2022-23 ఆధారిత కొత్త WPI సిరీస్లో తయారీ ఉత్పత్తులకు 64.23 శాతం వెయిటేజీ ఉంది.
ప్రాథమిక వస్తువులకు 22.62 శాతం, ఇంధనం-విద్యుత్ విభాగానికి 13.15 శాతం వెయిటేజీ ఉంది.
కొత్త WPI సిరీస్లో మొత్తం 697 వస్తువులను పరిగణనలోకి తీసుకుంటారు.
పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (DPIIT) పరిధిలోని ఆర్థిక సలహాదారు కార్యాలయం ఈ సూచీని రూపొందిస్తుంది.
తాజా WPI గణాంకాలను పరిశీలిస్తే ద్రవ్యోల్బణంపై మిశ్రమ పరిస్థితి కనిపిస్తోంది.
ఒకవైపు మొత్తం హోల్సేల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గడంతో పాటు ఇంధనం, విద్యుత్ ధరల ద్రవ్యోల్బణం గణనీయంగా పడిపోయింది.
మరోవైపు ప్రాథమిక వస్తువులు, తయారీ ఉత్పత్తులు, ఆహార ధరల ద్రవ్యోల్బణం పెరిగింది.
వివరాలు
CPI ద్రవ్యోల్బణం 4.45 శాతం.. ఆర్బీఐ లక్ష్యానికి మించి నమోదు
దీంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి పూర్తిగా తగ్గిపోలేదని, వ్యాపార సంస్థలపై ముడి సరుకుల ఖర్చుల రూపంలో ప్రభావం కొనసాగవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.
అయితే ద్రవ్యోల్బణంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన ద్రవ్య విధాన నిర్ణయాల్లో రిటైల్ ద్రవ్యోల్బణానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.
జూలైలో CPI ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.45 శాతంగా ఉంది.
ఇది ఆర్బీఐ నిర్దేశించిన 2-6 శాతం సహన పరిధిలోనే ఉన్నప్పటికీ.. మధ్యకాలిక లక్ష్యం అయిన 4 శాతానికి వరుసగా రెండో నెలలోనూ పైగా నమోదైంది.
వివరాలు
CPI ద్రవ్యోల్బణం 4.45 శాతం.. ఆర్బీఐ లక్ష్యానికి మించి నమోదు
ఇటీవల ఆర్బీఐ కీలక వడ్డీ రేటును యథాతథంగా ఉంచింది. ఇటీవలి ద్రవ్యోల్బణం పెరుగుదల తాత్కాలికమేనా? లేక మరింత విస్తరించి దీర్ఘకాలం కొనసాగుతుందా? అనే అంశాలను ఆర్బీఐ పరిశీలిస్తోంది.
మొత్తంగా జూలై WPI గణాంకాలు.. జూన్తో పోలిస్తే హోల్సేల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థలో ధరల ఒత్తిడి ఇంకా కొనసాగుతోందని సూచిస్తున్నాయి.