Indianoil: పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆందోళన అవసరం లేదు: ఇండియన్ ఆయిల్
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్కు అకస్మాత్తుగా డిమాండ్ పెరగడంతో స్థానికంగా సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయని, అయితే ఇది పూర్తిగా తాత్కాలిక సమస్యేనని ఐఓసీ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో పంట కోతల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో డీజిల్కు భారీగా డిమాండ్ పెరిగిందని తెలిపింది. మరోవైపు, ప్రైవేట్ పెట్రోల్ బంకుల్లో ఇంధన ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని బంకుల వైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొంది.
వివరాలు
అధిక ధరలకు విక్రయాలు
అంతర్జాతీయ ముడిచమురు ధరల ప్రభావంతో బల్క్ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 42 వేల ఇంధన స్టేషన్లలో కేవలం కొద్ది బంకుల్లో మాత్రమే ఈ సమస్య తలెత్తిందని, దీనిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని ఐఓసీ తెలిపింది. ఇంధనానికి అధిక డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.