Reliance and Rolls Royce: రిలయన్స్-రోల్స్ రాయిస్ భాగస్వామ్యం.. దేశీయ యుద్ధ విమాన ఇంజిన్కు బాటలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయంగా యుద్ధ విమానాల ఇంజిన్లను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని భారత్లోనే తయారు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అధునాతన మధ్యస్థాయి యుద్ధ విమానం (ఏఎమ్సీఏ) కోసం దేశీయ ఇంజిన్ను అభివృద్ధి చేసే అంశంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), బ్రిటన్కు చెందిన ప్రముఖ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ రోల్స్రాయిస్ సంయుక్తంగా ముందడుగు వేస్తున్నాయి. భారత్లోనే యుద్ధ విమానాల ప్రొపల్షన్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.
వివరాలు
ఏఎమ్సీఏ ప్రోగ్రామ్లో భాగంగా..
ఏఎమ్సీఏ ప్రోగ్రామ్లో భాగంగా యుద్ధ విమానాలకు అవసరమైన పవర్, ప్రొపల్షన్ టెక్నాలజీ, కవరింగ్ డిజైన్, అభివృద్ధి, తయారీ, పరీక్షలు, ఉత్పత్తి, జీవితకాల నిర్వహణ వంటి సేవలను అందించే 'ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్'ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఇరు కంపెనీలు శుక్రవారం వెల్లడించాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏఎమ్సీఏ కార్యక్రమానికి దేశీయంగా తయారయ్యే ఇంజిన్ మరింత బలాన్ని అందించనుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడుతూ.. భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని సాధించాలంటే కీలక సాంకేతికతల్లో దేశీయ సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వివరాలు
భవిష్యత్తులో అంతర్జాతీయంగా పోటీ పడే అవకాశం
యుద్ధ విమానాల ఇంజిన్ రూపకల్పనకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, తయారీలో రోల్స్రాయిస్కు ఉన్న అనుభవం.. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన సాంకేతిక, తయారీ, అమలు సామర్థ్యాలతో కలవడంతో ఏఎమ్సీఏ ఇంజిన్ అభివృద్ధికి బాటలు పడుతున్నాయని తెలిపారు.
ఈ రంగంలో స్వావలంబన సాధించడంతో పాటు భవిష్యత్తులో అంతర్జాతీయంగా పోటీపడే స్థాయికి భారత్ ఎదగగలదని అనంత్ అంబానీ పేర్కొన్నారు.
వివరాలు
'భారత్కు కీలక మైలురాయి'
రోల్స్రాయిస్ సీఈఓ తుఫాన్ ఎర్గిన్బిల్జిక్ మాట్లాడుతూ.. అత్యాధునిక ఇంజినీరింగ్లో సంస్థకు ఉన్న 100 ఏళ్ల అనుభవం, భారత్లో రిలయన్స్కు ఉన్న బలమైన స్థానం కలవడం ద్వారా దేశంలో శక్తిమంతమైన విమానయాన వ్యవస్థను నిర్మించేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు.
భారత స్వావలంబన ప్రయాణంలో ఇది కీలక మైలురాయిగా నిలవగలదని పేర్కొన్నారు.
ఏఎమ్సీఏ ఇంజిన్ అభివృద్ధి ద్వారా రక్షణ రంగంతో పాటు పౌర విమానయాన రంగంలోనూ సరికొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకునే అవకాశం ఉందని ఇరు కంపెనీలు తెలిపాయి.
వివరాలు
విదేశీ ఇంజిన్లపైనే ప్రస్తుతం ఆధారపడుతున్న భారత్
దేశీయంగా యుద్ధ విమాన ఇంజిన్ను తయారు చేయాలన్నది భారత్కు చాలా కాలంగా ఉన్న లక్ష్యం. ఇందులో భాగంగానే అయిదో తరం యుద్ధ విమాన కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రస్తుతం భారతదేశం యుద్ధ విమానాల ఇంజిన్ల కోసం విదేశీ సరఫరాదారులపై ఆధారపడుతోంది.
దేశీయంగా ఇంజిన్ అభివృద్ధి, తయారీ పూర్తయితే ఈ ఆధారపడటం తగ్గడంతో పాటు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి మరింత బలోపేతం కానుంది.
వివరాలు
కాంప్లెక్స్ ఎప్పటికి సిద్ధమవుతుంది?
ప్రతిపాదిత ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్కు సంబంధించిన ఆర్థిక వివరాలను రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్రాయిస్ వెల్లడించలేదు.
అలాగే ప్రాజెక్టు పూర్తయ్యే గడువు, రెండు సంస్థల్లో ఎవరి వాటా ఎంత ఉండనుందనే వివరాలను కూడా ప్రస్తుతానికి ప్రకటించలేదు.