Stock market crash: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ₹6 లక్షల కోట్లు ఆవిరి
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దీనికి తోడు విదేశీ మదుపర్లు భారీగా అమ్మకాలకు దిగడంతో సూచీలు మరోసారి గణనీయంగా క్షీణించాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీలు క్రమంగా నష్టాల బాట పట్టి చివరికి భారీ పతనంతో ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్ 800 పాయింట్ల వరకు పడిపోగా, నిఫ్టీ 25,050 దిగువకు చేరింది. దీంతో నిన్న కనిపించిన లాభాల ఉత్సాహం ఒక్క రోజుకే పరిమితమైంది. మార్కెట్ పతనంతో మదుపర్ల సంపద సుమారు రూ.6 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.452 లక్షల కోట్ల స్థాయికి చేరింది.
వివరాలు
మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో నష్టాల్లోకి..
సెన్సెక్స్ ఉదయం 82,307.37తో పోలిస్తే స్వల్ప లాభంతో 82,335.94 వద్ద ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో నష్టాల్లోకి జారుకుంది. ట్రేడింగ్ సమయంలో 81,471.82 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ, చివరకు 769.67 పాయింట్లు కోల్పోయి 81,537.70 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 241.25 పాయింట్లు నష్టపోయి 25,048.65 వద్ద స్థిరపడింది. ఇదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.93 వద్ద మరోసారి ఆల్టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ 30 కంపెనీల్లో అదానీ పోర్ట్స్, ఎటెర్నల్, ఇండిగో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు ఎక్కువగా పడిపోయాయి. మరోవైపు హిందుస్థాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ షేర్లు లాభాల్లో నిలిచాయి.
వివరాలు
ఎఫ్ఐఐలు వరుస అమ్మకాలు మార్కెట్ పతనానికి ప్రధాన కారణం
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 64.79 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,926 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐలు) వరుస అమ్మకాలు నిలుస్తున్నాయి. గురువారం వరుసగా 13వ రోజూ వారు ఈక్విటీ మార్కెట్లో రూ.2,550 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. జనవరి నెలలో ఇప్పటివరకు మొత్తం రూ.36,591 కోట్ల విలువైన షేర్లను ఎఫ్ఐఐలు అమ్మేయడం మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపింది. ఇదిలా ఉండగా లంచం ఆరోపణలకు సంబంధించిన కేసులో అదానీ గ్రూప్ ప్రమోటర్లకు సమన్లు జారీ చేసేందుకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) కోర్టు అనుమతి కోరినట్లు వచ్చిన వార్తలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి.
వివరాలు
ఆల్టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ
ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ వంటి గ్రూప్ షేర్లు 13 శాతం వరకు పడిపోయి మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఇంట్రాడేలో 91.99 అనే జీవితకాల కనిష్ఠ స్థాయికి పడిపోవడం కూడా అమ్మకాల ఒత్తిడిని మరింత పెంచింది. కరెన్సీ బలహీనత విదేశీ పెట్టుబడిదారులను మార్కెట్ నుంచి నిష్క్రమించేలా చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి
ఇదే సమయంలో అమెరికా-యూరప్ మధ్య వాణిజ్య సుంకాలపై కొనసాగుతున్న ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్నాయి. దీనికితోడు సిప్లా, ఇండిగో వంటి ప్రముఖ కంపెనీల త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. సిప్లా లాభాలు 57 శాతం తగ్గడంతో ఆ కంపెనీ షేర్లు 5 శాతం వరకు పడిపోయాయి. అలాగే ఇండిగో లాభాలు 78 శాతం క్షీణించడంతో ఆ షేరు విలువ సుమారు 4 శాతం మేర తగ్గింది. ఈ అన్ని అంశాలు కలిసి మార్కెట్ పతనానికి దారితీశాయి.