Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25,700 దిగువకు నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుల మధ్య చివరకు నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, రియల్టీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలపై భారమైంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అలాగే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారులను అప్రమత్తం చేయగా, దీని ప్రభావం మన మార్కెట్లపై పడింది. ఫలితంగా వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాల బాట పట్టాయి. మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం (జనవరి 15) బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. మార్కెట్లు తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సెన్సెక్స్ ఉదయం 83,358.54 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ట్రేడింగ్ను ప్రారంభించింది (క్రితం ముగింపు 83,627.69).
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 65 డాలర్లు
మధ్యలో కొంతసేపు లాభాల్లోకి వెళ్లినా ఆ ఉత్సాహం నిలవలేదు.రోజంతా 83,185.20 నుంచి 83,809.98 పాయింట్ల మధ్య ఊగిసలాడిన సూచీ చివరకు 244.98 పాయింట్లు కోల్పోయి 83,382.71 వద్ద ముగిసింది. నిఫ్టీ 66.70 పాయింట్లు తగ్గి 25,665.60 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.31గా నమోదైంది. సెన్సెక్స్ 30 షేర్లలో టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు టాటా స్టీల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎటెర్నల్ షేర్లు లాభాల్లో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 65 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 4,636 డాలర్ల స్థాయిలో కొనసాగుతోంది.