Zhang Yiming: ఆసియా కుబేరుల్లో అదానీకి షాక్.. అగ్రస్థానంలో టిక్టాక్ ఫౌండర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో కీలక మార్పు చోటుచేసుకుంది. భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి.. ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. జాంగ్ యిమింగ్ నికర సంపద ప్రస్తుతం 105 బిలియన్ డాలర్లను దాటింది.
వివరాలు
ఎనిమిదేళ్లలో ఎనిమిది రెట్లు వృద్ధి
జాంగ్ యిమింగ్ సంపద గత కొన్నేళ్లుగా వేగంగా పెరుగుతోంది. 2019 మార్చిలో ఆయన ఆస్తుల విలువ సుమారు 13 బిలియన్ డాలర్లుగా ఉండేది.
ప్రస్తుతం అది 105 బిలియన్ డాలర్లను మించడంతో.. ఎనిమిది రెట్లకు పైగా వృద్ధి నమోదైంది.
బైట్డ్యాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో దూకుడుగా విస్తరించడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.
కంపెనీ ఏఐ ఉత్పత్తులైన డౌబావో చాట్బాట్, సీడ్యాన్స్ వీడియో జనరేషన్ టూల్కు వచ్చిన ఆదరణతో బైట్డ్యాన్స్ విలువ గణనీయంగా పెరిగింది.
ఈ నెలలో బ్లాక్రాక్, ఫిడెలిటీ వంటి అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు బైట్డ్యాన్స్ వాల్యుయేషన్ను సవరించాయి.
దీంతో జాంగ్ యిమింగ్ సంపదకు మరో 12 బిలియన్ డాలర్లు జతయ్యాయి.
వివరాలు
అదానీ సంపదలో తగ్గుదల
మరోవైపు.. గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది జూన్లో సుమారు 120 బిలియన్ డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరింది.
అయితే, ఆ తర్వాత కొంతమేర తగ్గింది. ఎంఎస్సీఐ ఇండెక్స్లో స్టాక్ రీబ్యాలెన్సింగ్, పెరుగుతున్న ముడి చమురు ధరలు, బాండ్ యీల్డులు వంటి అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు ఆయన సంపదపై ప్రభావం చూపినట్లు సమాచారం.
వివరాలు
మారుతున్న సంపద సృష్టి ధోరణి
ఆసియాలో సంపద సృష్టి స్వరూపం క్రమంగా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంధనం, మౌలిక సదుపాయాలు వంటి సంప్రదాయ రంగాలతో పాటు.. టెక్నాలజీ, ఏఐ ఆధారిత సంస్థలు కూడా భారీ సంపదను సృష్టిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.
ఇప్పటికే చైనాలో అత్యంత సంపన్నుడిగా ఉన్న జాంగ్ యిమింగ్.. ఇప్పుడు ఆసియా కుబేరుల్లో అగ్రస్థానానికి చేరడం ఈ మార్పుకు ఉదాహరణగా నిలుస్తోంది.