Dulquer Salmaan : లగ్జరీ కార్ల దిగుమతి కేసు.. నటుడు దుల్కర్ సల్మాన్ను విచారించిన కస్టమ్స్ అధికారులు
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ను లగ్జరీ కార్ల దిగుమతి వ్యవహారానికి సంబంధించి కస్టమ్స్ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొచ్చిలోని కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయానికి హాజరైన ఆయన నుంచి అధికారులు వివరణలు తీసుకుని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను ఉపయోగించి భూటాన్ నుంచి ఖరీదైన కార్లను అక్రమంగా భారత్లోకి తీసుకువస్తున్న ముఠాపై గత ఏడాది సెప్టెంబర్లో కేరళవ్యాప్తంగా కస్టమ్స్ శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. "ఆపరేషన్ నుమ్ఖోర్" పేరుతో చేపట్టిన ఈ దర్యాప్తులో దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా, దుల్కర్ సల్మాన్ నివాసంలో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు.
వివరాలు`
అసలు కేసు ఏమిటి?
భూటాన్ ఆర్మీ వినియోగంలో ఉన్న కొన్ని అత్యంత ఖరీదైన వాహనాలను సేవల నుంచి ఉపసంహరించుకుని వేలానికి ఉంచింది. ఈ వేలంలో కొందరు ఏజెంట్లు వాటిని చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆ వాహనాలను కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండా అక్రమ మార్గంలో భారత్కు తరలించినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ మార్గంగా ఈ కార్లను దేశంలోకి తీసుకువచ్చి, తాత్కాలిక చిరునామాల ఆధారంగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సహా విశ్వసనీయ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని ఈ వాహనాలను విక్రయించినట్లు సమాచారం అందడంతో కస్టమ్స్ శాఖ విచారణను మరింత విస్తరించింది.
వివరాలు
ఆ ఆరోపణలను ఖండించిన దుల్కర్..
ఈ కేసు దర్యాప్తులో భాగంగా దుల్కర్ సల్మాన్తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన దుల్కర్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తాను వినియోగిస్తున్న ల్యాండ్ రోవర్ కారును ఎలాంటి అక్రమ మార్గంలో కొనుగోలు చేయలేదని, అన్ని చట్టబద్ధ ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాతే దాన్ని తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. కస్టమ్స్ క్లియరెన్స్, ఇన్వాయిస్తో పాటు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు తన వద్ద ఉన్నాయని కూడా కోర్టుకు తెలియజేశారు. లగ్జరీ కార్ల దిగుమతి వ్యవహారంలో ఆదాయపు పన్ను, జీఎస్టీ ఎగవేతతో పాటు నగదు అక్రమ చలామణికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నట్లు కస్టమ్స్ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.