BITS Hyderabad: కిడ్నీ వ్యాధుల గుర్తింపునకు బిట్స్ హైదరాబాద్ వినూత్న మొబైల్ పరికరం
ఈ వార్తాకథనం ఏంటి
మూత్రపిండాల పనితీరులో ఏర్పడే లోపాలను వేగంగా గుర్తించేందుకు బిట్స్ హైదరాబాద్ ప్రొఫెసర్లు పార్వతి నాయర్, స్వయంశ్రీ, ఆర్.ఎన్. పొన్నాలగు, సంకేత్ గోయల్ కలిసి వినూత్నమైన మొబైల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కిడ్నీ పనితీరును అంచనా వేయడానికి అవసరమైన బయోమార్కర్ పరీక్షలు ప్రధానంగా ఆసుపత్రుల ప్రయోగశాలల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ పరిమితిని అధిగమించేలా పరిశోధకులు 'పోర్టబుల్ మల్టీప్లెక్స్ ఎలక్ట్రోకెమికల్ డయాగ్నోస్టిక్' పేరుతో రోగుల వద్దకే తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించే పరికరాన్ని రూపొందించారు. ఇందులో లేజర్ గ్రాఫేన్, ఎలక్ట్రోడ్లు, ఎలక్ట్రోకెమికల్ సెన్సర్లు వంటి ఆధునిక సాంకేతిక భాగాలను అమర్చారు.
వివరాలు
సెల్ఫోన్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక బ్రౌజర్తో అనుసంధానం
ఈ పరికరం సహాయంతో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో క్రియాటినైన్, యూరిక్ యాసిడ్, యూరియా వంటి కీలక బయోమార్కర్ల స్థాయులను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. సెల్ఫోన్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక బ్రౌజర్తో అనుసంధానించిన ఈ పరికరం మూత్రపిండాలకు సంబంధించిన బయోమార్కర్లను గుర్తించి ఫలితాలను అందిస్తుంది. ఈ పరికరం పనితీరును ప్రయోగశాల స్థాయిలో విజయవంతంగా పరీక్షించిన అనంతరం, తమ పరిశోధన వివరాలను బిట్స్ హైదరాబాద్ ఆచార్యులు సైన్స్ డైరెక్ట్ జర్నల్కు పంపించారు. ఆ పరిశోధన పత్రం ఇటీవల ఆన్లైన్లో ప్రచురితమైంది. ఈ సాంకేతికతను మరింత మెరుగుపరచి, భవిష్యత్తులో మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న రోగులపై ప్రత్యక్షంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు బిట్స్ హైదరాబాద్ పరిశోధకులు వెల్లడించారు.