Mandakini: దావూద్ ఇబ్రహీంతో ఫొటో.. నా కెరీర్ను దెబ్బతీసింది: నటి మందాకిని
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటి మందాకిని (Mandakini) గతంలో తీవ్ర వివాదానికి కారణమైన ఓ వైరల్ ఫొటోపై తాజాగా స్పందించారు. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) పక్కన ఆమె కూర్చున్న ఫొటో కొన్నేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటోపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ ఘటన తన సినీ కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపిందని మందాకిని తెలిపారు.
వివరాలు
క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా ఫొటో..
ఓ షోలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన సమయంలోనే ఈ ఘటన జరిగిందని నటి వివరించారు.
అనుకోకుండా క్రికెట్ స్టేడియానికి వెళ్లాల్సి వచ్చిందని,అక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తున్న సమయంలో దావూద్ ఇబ్రహీంతో మాట్లాడినట్లు చెప్పారు. అయితే,తాను కావాలని ఆయనను కలవలేదని స్పష్టం చేశారు.
''నేను ఓ షో కోసం దుబాయ్కు వెళ్లాను.అక్కడ అనుకోకుండా క్రికెట్ స్టేడియానికి వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో దావూద్తో మాట్లాడాను.అంతేగానీ,ఆయన నన్ను దుబాయ్కు ఆహ్వానించలేదు. ఒక నటిగా మనం ఎవరితో మాట్లాడాలన్నది ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. చాలామంది వచ్చి పలకరిస్తుంటారు. ఇది కూడా అలానే జరిగింది.
కానీ, ఆ ఒక్క ఫొటో ఇంత పెద్ద వివాదానికి దారితీస్తుందని అసలు ఊహించలేదు'' అని మందాకిని ఓ మీడియా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
వివరాలు
వివరణ ఇచ్చినా వివాదం ఆగలేదు..
ఆ సమయంలో పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తనకు అర్థం కాలేదని మందాకిని తెలిపారు.
ఈ వ్యవహారంపై అప్పుడే వివరణ ఇచ్చినప్పటికీ, వివాదం మాత్రం కొనసాగిందని చెప్పారు.
ఆ ఫొటో కారణంగా తన కెరీర్ తీవ్రంగా దెబ్బతిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ''అప్పట్లో ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియలేదు. ఈ వ్యవహారంపై అప్పుడే వివరణ ఇచ్చినప్పటికీ, వివాదం మాత్రం అలాగే కొనసాగింది. ఆ ఫొటో నా కెరీర్ను తీవ్రంగా దెబ్బతీసింది'' అని నటి అన్నారు.
వివరాలు
అండర్వరల్డ్ నిధులపై అవగాహన లేదు..
1980ల కాలంలో బాలీవుడ్ సినిమాలకు అండర్వరల్డ్ నుంచి నిధులు అందుతున్నాయనే విషయంపై తనకు ఎలాంటి అవగాహన లేదని మందాకిని చెప్పారు.
సినిమాలు, వార్తల ద్వారానే ఆ విషయాల గురించి తెలుసుకున్నానని వివరించారు.
'రామ్ తేరీ గంగా మైలీ'తో గుర్తింపు..
మందాకిని 1985లో రాజ్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామ్ తేరీ గంగా మైలీ' చిత్రంతో కథానాయికగా సినీరంగ ప్రవేశం చేశారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
తెలుగు ప్రేక్షకులకు కూడా మందాకిని సుపరిచితమే. 'సింహాసనం', 'భార్గవ రాముడు' చిత్రాల్లో నటించి మెప్పించారు.