Maharashtra: ఆస్పత్రిలో ఘోరం.. 24 గంటల్లో 18 మంది మృతి
మహారాష్ట్రలోని ఆస్పత్రిలో ఘోరం జరిగింది. 24 గంటల వ్యవధిలో భారీగా రోగులు మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రభుత్వాస్పత్రిలో అనారోగ్యం కారణంగా 18 మంది చనిపోయారని ఆరోగ్యశాఖ మంత్రి తానాజీ సావంత్ ప్రకటించారు. ఘటనపై 2 రోజుల్లో నివేదికివ్వాలని డీన్ను ఆదేశించారు. వయో భారం, ఆరోగ్యం విషమించాక ఆస్పత్రికి రావడంతో మరణాలు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రికార్డులను తనిఖీ చేస్తున్నారు. భారీగా మరణాలు జరిగిన నేపథ్యంలో ఆస్పత్రి వద్ద ముందు జాగ్రత్తగా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించినట్లు డీసీపీ గనేశ్ గావ్డే వెల్లడించారు. ఆస్పత్రి వైద్య విద్యా పరిధిలో ఉన్నందున ఆ శాఖ మంత్రి ముష్రిఫ్ సమీక్షిస్తున్నట్లు మంత్రి సావంత్ తెలిపారు.