DGCA: ఉదయం నుంచి 250 విమానాలు రద్దు; ఇండిగో ఎయిర్లైన్ అధికారులకు డీజీసీఏ సమన్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందిన ఇండిగో ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల విమాన సేవల్లో తీవ్ర వాయిదాలు,రద్దులు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బంది కొరత, సాంకేతిక లోపాలు,అలాగే ఎయిర్పోర్టుల్లో అధిక రద్దీ వంటి పరిస్థితులు ఈ అవాంతరాలకు కారణమవుతున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్తో పాటు ఇతర నగరాలకు వెళ్లే అనేక ఇండిగో విమానాలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండిగో కార్యకలాపాలపై విచారణ చేపట్టేందుకు పౌర విమానయాన నియంత్రక సంస్థ డీజీసీఏ(DGCA)ఆ ఎయిర్లైన్ అధికారులకు సమన్లు జారీ చేసింది. భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థగా పేరున్న ఇండిగో సేవల్లో ఏర్పడిన లోపాల గురించి వివరాలను సేకరించేందుకు ఈ చర్య తీసుకుంది.
వివరాలు
దాదాపు 24విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి
ఇదిలా ఉండగా,కేవలం గతరెండు రోజుల వ్యవధిలోనే సుమారు 250 నుంచి 300 మధ్య ఇండిగో విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. నేటికీ భారీ సంఖ్యలో విమానాలు రద్దైనట్టు సమాచారం.ఢిల్లీ విమానాశ్రయంలో మాత్రమే 30 సర్వీసులు నిలిచిపోగా,కోల్కతాలో నాలుగు విమానాలు రద్దయ్యాయి. అక్కడి నుంచీ దాదాపు 24విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. వీటిలో రెండు అంతర్జాతీయ సర్వీసులు కూడా ఉన్నాయి.బుధవారం ఒక్క రోజే 100కు పైగా ఇండిగో విమానాలు రద్దుకాగా,మరికొన్ని షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడిచాయి. ఆరోజు ఢిల్లీలో 38,బెంగళూరులో 42,ముంబైలో 33,హైదరాబాద్లో 19విమానాలు రద్దైనట్లు వెల్లడైంది. గతనెల నవంబర్లో మాత్రమే మొత్తం 1,232విమాన సర్వీసులను రద్దు చేసినట్టు డీజీసీఏ ఇప్పటికే ప్రకటించింది. సాధారణ పరిస్థితుల్లో ఇండిగో ప్రతిరోజూ సగటున సుమారు 2,200విమానాలను నిర్వహిస్తోందని సమాచారం.